హైదరాబాద్, వెలుగు: నౌహీరా కేసులో ఈడీ ఆ సంస్థలకు చెందిన రూ.78.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో హైదరాబాద్ లోని ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కు చెందిన రూ.37.58 కోట్ల స్థిరాస్తులు, బెంగళూరులోని సల్లార్పురియా గ్రూప్కు చెందిన రూ.41.05 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు ఈడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అధిక మొత్తంలో తిరిగి చెల్లింపుల పేరుతో ప్రజల నుంచి సుమారు రూ. 5 వేల కోట్లు వసూలు చేసి.. వివిధ సంస్థల్లోకి నిధులు మళ్లించారనే ఆరోపణలతో 2018లో ఈడీ నౌహీరా సంస్థలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎస్ఏ బిల్డర్స్ ద్వారా టోలిచౌకిలో ఆస్తుల కొనుగోలుకు రూ.148 కోట్లు మళ్లించినట్లు గుర్తించింది. అయితే, కొనుగోలు చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.70 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.