- దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్
- అందులో 15 మంది తెలంగాణోళ్లే ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధిస్తే, అందులో అత్యధికంగా15 మంది తెలంగాణ స్టూడెంట్సే ఉన్నారు. జేఈఈ మెయిన్–2024 ఏప్రిల్సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్jeemain.nta.ac.inలో అందుబాటులో ఉంచింది.
ఈ ఫలితాలతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు, ఆలిండియా ర్యాంక్ హోల్డర్స్, రాష్ట్రాలవారీగా టాపర్ల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్)లో నిర్వహించింది. తాజాగా రెండో సెషన్ను ఏప్రిల్ 4 నుంచి 12వరకు నిర్వహించగా, సెషన్ -2 పరీక్షకు 12.57లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ మెరిట్ లిస్ట్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేసింది.
15 మంది తెలంగాణోళ్లే
మొత్తం 56 మంది 100 పర్సంటైల్స్ స్కోర్(బీఈ/బీటెక్) సాధించగా.. ఇందులో 15 మంది తెలంగాణ విద్యార్థులే ఉన్నారు.
100 పర్సంటైల్స్లోని తెలంగాణ విద్యార్థులు: హుందేకర్ విదిత్, ముత్తవరపు అనూప్, వెంకట సాయితేజ, రెడ్డి అనిల్, రోహణ్ సాయి పబ్బ, శ్రీయశష్ మోహన్ కల్లూరి, కేశం చెన్నబసవారెడ్డి, ఎం. సాయి దివ్యతేజారెడ్డి, రిషి శేఖర్ శుక్లా, తవ్వ దినేశ్ రెడ్డి, గంగ శ్రేయష్, రితిష్ బాలాజీ, టి. జయదేవ్రెడ్డి, మావూరు జశ్విత్, దొరిసాల శ్రీనివాసరెడ్డి.