తడబ్యాటు వీడితేనే..

తడబ్యాటు వీడితేనే..
  • ఉ. 6.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

హామిల్టన్‌‌:  పాకిస్తాన్​పై ఘన విజయంతో వన్డే వరల్డ్​కప్‌‌ను మొదలుపెట్టి గత పోరులో న్యూజిలాండ్‌‌ చేతిలో చిత్తయిన ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ మూడో సవాల్‌‌కు రెడీ అయింది. శనివారం జరిగే మ్యాచ్‌‌లో డేంజర్‌‌ టీమ్‌‌ వెస్టిండీస్‌‌తో పోటీ పడనుంది.  మరో ఓటమి ఎదురైతే ఇండియా  సెమీస్‌‌ అవకాశాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో కరీబియన్లపై  కచ్చితంగా గెలవాలని మిథాలీ అండ్‌‌ కో భావిస్తోంది. అది జరగాలంటే ముందుగా బ్యాటర్లు సత్తా చాటాల్సి ఉంటుంది. ముఖ్యంగా  కివీస్‌‌పై నిరాశ పరిచిన  సీనియర్లు  స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌‌, యంగ్‌‌స్టర్‌‌ యస్తికా భాటియా, ఆల్‌‌రౌండర్‌‌ దీప్తి శర్మపై  విమర్శలు వస్తున్నాయి. ఆ  మ్యాచ్‌‌లో ఏకంగా 162 డాట్‌‌ బాల్స్‌‌ ఆడారు. 20 ఓవర్లలో కేవలం 50 రన్స్‌‌ మాత్రమే చేయడం టీమ్‌‌ను దెబ్బకొట్టింది. మరోవైపు  ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లో  ఆతిథ్య న్యూజిలాండ్‌‌తో పాటు డిఫెండింగ్‌‌ చాంప్‌‌ ఇంగ్లండ్‌‌ను ఓడించిన విండీస్​ జోష్​లో ఉంది. కాబట్టి మంధాన, మిథాలీ తమ బ్యాట్లకు పని చెబితేనే ఇండియా నుంచి గెలుపు ఆశించొచ్చు.