
- డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ. 80 వేలు తీసుకున్న పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత
- రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిన పాల్వంచ టౌన్ ఎస్సై రాము
- మక్తల్లో సర్వేయర్ను పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు
పరకాల, వెలుగు : ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీతతో పాటు, మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ నరేశ్ను గురువారం ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన ప్రకారం.. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురానికి చెందిన లడే రాజేశ్వర్రావుకు అదే మండలంలోని మాదారం రెవెన్యూ శివారులో 1,173 గజాల స్థలం ఉంది.
దీనిని తన కుమారులైన శ్రీనివాస్, శ్రీకాంత్ పేరున నాలుగు పార్ట్లుగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు 15 రోజుల కింద పరకాల సబ్రిజిస్ట్రార్ సునీతను కలిశాడు. ఆమె సూచనతో డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేశ్ను కలువగా ఒక్కో పార్ట్ రిజిస్ట్రేషన్కు రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 80 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ ఆఫీసర్లను సంప్రదించాడు.
వారి సూచనతో గురువారం రూ. 80 వేలను గురువారం నరేశ్కు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ ఆఫీసర్లు నరేశ్ను పట్టుకొని, డబ్బులను సీజ్ చేసి విచారించడంతో రిజిస్ట్రార్ సునీత ఆదేశాల మేరకే తాను డబ్బు తీసుకున్నట్లు అంగీకరించాడు. దీంతో ఏసీబీ ఆఫీసర్లు సబ్ రిజిస్ట్రార్ సునీత, డాక్యుమెంట్ రైటర్ నరేశ్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని శుక్రవారం వరంగల్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య చెప్పారు.
రూ. 20 వేలు తీసుకున్న ఎస్సై
పాల్వంచ రూరల్, వెలుగు : ఓ కేసులో చార్జ్షీటు దాఖలు చేసేందుకు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన ఎస్సైని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... పాల్వంచ పట్టణం బొల్లోరి గూడెం గ్రామానికి చెందిన సీరపు శ్రావణి తనను ఐదుగురు వ్యక్తులు బెదిరించారంటూ మే 19న పాల్వంచ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని ఎస్సై బాణాల రాము డిమాండ్ చేశాడు.
ఈ విషయాన్ని శ్రావణి తన తరఫు లాయర్ లక్ష్మారెడ్డికి చెప్పడం ఆయన ఏసీబీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. వారి సూచనతో గురువారం శ్రావణితో పాటు, లాయర్ లక్ష్మారెడ్డి ఎస్సై రాము ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎస్సైని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ చెప్పారు.
మక్తల్లో సర్వేయర్...
మక్తల్, వెలుగు: వ్యవసాయభూమి హద్దులు కొలిచేందుకు లంచం తీసుకున్న సర్వేయర్ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన గాసం వెంకటేశ్కు మంతన్గోడులో 17 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నలుగురు అన్నదమ్ములు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం భూమి హద్దులు నిర్ణయించాలంటూ మీ సేవలో అప్లై చేసుకున్నారు. జూన్ 26న సర్వేయర్ బాలరాజు పొలం వద్దకు వెళ్లి పరిశీలించాక మ్యాప్ తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఎంతకూ రాకపోవడంతో వెంకటేశ్ ఈ నెల 6న తహసీల్దార్ ఆఫీస్కు వచ్చి సర్వేయర్ను కలువగా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ. 3 వేలు ఇచ్చాడు. మిగాత రూ. 9 వేలు ఇస్తేనే వస్తానని సర్వేయర్ తేల్చి చెప్పాడు. దీంతో వెంకటేశ్ ఏసీబీ ఆఫీసర్లను సంప్రదించగా వారి సూచనతో గురువారం సాయంత్రం తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న బాలరాజుకు రూ. 9 వేలు ఇచ్చాడు. అక్కడే ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సర్వేయర్ను బాలరాజును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రావణ కృష్ణగౌడ్, ఇన్స్పెక్టర్లు సయ్యద్ అబ్దుల్ ఖాదర్, జిలాని, లింగయ్య ఉన్నారు.