భూమి కోసం టవర్​ ఎక్కిన యువకుడు

భూమి కోసం టవర్​ ఎక్కిన యువకుడు

కంది, వెలుగు :  భూ రికార్డుల్లో తమ పట్టా భూమిని సర్కారు భూమిగా ఆఫీసర్లు తప్పుగా నమోదు చేశారని, సంవత్సరం నుంచి ఆఫీసు చట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఓ యువకుడు సెల్​టవర్​ఎక్కాడు. మంగళవారం బాధిత కుటుంబసభ్యులంతా కలిసి తహసీల్దార్​ఆఫీసుకు వెళ్లి అడిగినా ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో భూ యజమాని తమ్ముడు ఈ పని చేశాడు.

బాధితుడి కథనం ప్రకారం..సంగారెడ్డి జిల్లా కంది మండలం తున్కిల తండాకు చెందిన జంవత్​రావుకు 540‌/ఈ2లో 2 ఎకరాల ఒక్క గుంట వ్యవసాయ భూమి ఉంది. కాగా, అకోలా-–నాందేడ్​ రోడ్డు విస్తరణలో 10 గుంటల భూమి పోయింది. మిగిలిన భూమిని ఆఫీసర్లు గవర్నమెంట్​భూమిగా రికార్డు చేశారు. దీంతో గత ఏడాది నుంచి ఆ భూమిని మార్చాలని జంవత్​రావుతో పాటు అతడి తమ్ముడు అనిల్, ఇతర కుటుంబసభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పని చేయకపోవడంతో జంవత్​రావు తమ్ముడు అనిల్​ మంగళవారం ఆఫీసు ఆవరణలో ఉన్న సెల్​టవర్ ​ఎక్కాడు. తమ సమస్యను పరిష్కరించేదాకా దిగనని భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో తామంతా తహసీల్దార్​ దగ్గరకు వెళ్లి అనిల్ ​టవర్​ఎక్కిన విషయం చెప్పామని, దానికి ఆయన తానేమీ చేయలేనని, ఇష్టం వచ్చినట్టు చేసుకోండని నిర్లక్ష్యంగా మాట్లాడాడని బాధితుడి కుటుంబీకులు ఆరోపించారు. కొద్దిసేపటికి సంగారెడ్డి రూరల్​ఎస్ఐ శ్రీనివాస్​రెడ్డి తన సిబ్బందితో వచ్చి బాధితుడితో ఫోన్​లో మాట్లాడారు. పరిష్కారానికి హామీ ఇవ్వడంతో కిందికి దిగి వచ్చాడు