ఫస్టియర్ క్లాసులకు షెడ్లు..పూర్తికాని మెడికల్ కాలేజీ బిల్డింగ్ల నిర్మాణం

ఫస్టియర్ క్లాసులకు షెడ్లు..పూర్తికాని మెడికల్ కాలేజీ బిల్డింగ్ల నిర్మాణం
  • ముగిసిన స్టేట్​కోటా సెకండ్​ఫేజ్ ​కౌన్సిలింగ్​
  • ఎంసీహెచ్​ బిల్డింగ్​ లో క్లాసుల నిర్వాహణకు ఏర్పాట్లు
  • ప్రాక్టికల్స్​ కోసం జీజీహెచ్​పై మరో షెడ్​ నిర్మాణానికి చర్యలు
  • ఈనెల 13 నుంచి తరగతుల ప్రారంభం

జనగామ, వెలుగు : జనగామ గవర్నమెంట్​మెడికల్​ కాలేజీలో క్లాసుల నిర్వాహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పక్కా బిల్డింగ్​అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఏడాది కూడా ప్రైవేటు బిల్డింగ్​లలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫస్ట్​ఇయర్ అడ్మిషన్లు కొనసాగుతుండగా, ఈనెల 13 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 

కొనసాగుతున్న సీట్ల భర్తీ..

మెడికల్​ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్​ ఫస్ట్​ఇయర్​ కోసం 100 సీట్లు కేటాయించగా, భర్తీ ప్రక్రియ పూర్తి కావస్తోంది. స్టేట్​కోటా సెకండ్​ఫేజ్​ కౌన్సిలింగ్​ సోమవారం పూర్తి కాగా, ఆల్​ ఇండియా కోటా సీట్ల భర్తీ ఆప్షన్​ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్టేట్​గవర్నమెంట్​కోటా 85 సీట్లకు 84 మంది స్టూడెంట్లు, ఆల్ ఇండియా కోటా 15 సీట్లకు 13 మంది స్టూడెంట్లు రిపోర్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు. మూడో దశ కౌన్సిలింగ్​లో మిగిలిన సీట్లు కూడా భర్తీ కానున్నట్లు చెప్పారు. 

జీజీహెచ్​పై షెడ్​ నిర్మాణం..

ప్రస్తుతం జనగామ శివారు ఎంసీహెచ్​ హాస్పిటల్​ పక్కన మెడికల్​ కాలేజీ రన్ అవుతుండగా, రెండు లెక్చర్​హాల్స్​(తాత్కాలిక షెడ్లు) అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఫస్ట్ ​ఇయర్​ స్టూడెంట్లు వస్తున్నందున మరో లెక్చర్​ హాల్​ అవసరం ఉంది. దీంతో తాత్కాలికంగా ఎంసీహెచ్​ హాస్పిటల్​పై అంతస్తులో క్లాసుల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాక్టికల్స్​కోసం మరో షెడ్​అవసరం ఉండగా, జనగామ జీజీహెచ్​బిల్డింగ్​ పై తాత్కాలికంగా రూ.50 లక్షలతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఇదిలాఉంటే కాలేజీ అడ్మినిస్ట్రేషన్​ బ్లాక్​ కోసం ఎంసీహెచ్​ హాస్పిటల్​ రెండో అంతస్తును వినియోగిస్తున్నారు. కాలేజీ కార్యకలాపాలు థర్డ్​ ఇయర్​లోకి అడుగు పెడుతున్నా, ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. గతేడాది అడ్మిషన్ల టైంలోనూ ప్రైవేటు బిల్డింగ్​ల వైపు అడుగులు వేసిన అధికారులకు ఈసారీ అదే పరిస్థితి. గతేడాది గర్ల్స్​కోసం సిద్దిపేట రోడ్డులోని సుశీలమ్మ వృద్ధాశ్రమంలో హాస్టల్​ వసతి కల్పించగా, ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. బాయ్స్​కోసం చంపక్​హిల్స్​సమీపంలోనే ఉన్న డీఆర్డీఏ బిల్డింగ్​లో హాస్టల్​వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

త్వరలో అందుబాటులోకి పక్కా బిల్డింగ్..​ 

జనగామలోని సిద్దిపేట రోడ్డులో అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న మెడికల్​ కాలేజీ కొత్త బిల్డింగ్​పనులు వేగవంతమయ్యాయి. వచ్చే అకడమిక్​ఇయర్​ వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, హాస్టల్స్​ బిల్డింగ్​ వచ్చే డిసెంబర్​ వరకు అందివ్వాలని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. 18 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్లతో  నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ పూర్తైతే స్టూడెంట్ల ఇక్కట్లు తొలగనున్నాయి.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నం..

ఫస్ట్​ఇయర్​ స్టూడెంట్ల అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. స్టేట్​కోటాలో 84, ఆల్​ ఇండియా కోటా 13 మంది రిపోర్ట్​ చేశారు. కొత్తగా జాయిన్​ అయ్యే స్టూడెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 13 నుంచి క్లాసులు స్టార్ట్​ కానున్నాయి. కొత్త మెడికల్​ కాలేజీ బిల్డింగ్​ కూడా కొద్ది నెలల్లో అందుబాటులోకి రానుంది.- కే.నాగమణి, గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​, జనగామ