హైదరాబాద్లో ఆ 30 బిల్డింగుల సంగతేంది ? హాస్టళ్లు, ఇండ్లు, ఓయో హోటళ్లుగా అవతారం

హైదరాబాద్లో ఆ 30 బిల్డింగుల సంగతేంది ? హాస్టళ్లు, ఇండ్లు, ఓయో హోటళ్లుగా అవతారం
  • రెండేండ్ల కింద సిద్ధిక్​నగర్లో ఒరిగిన బిల్డింగ్
  • అక్రమమంటూ 36 బిల్డింగుల వరకు సీజ్​ 
  • మళ్లీ  కన్నెత్తి చూడలే.. కట్టుకున్నా స్పందించలే
  • ఇప్పుడు అంజయ్యనగర్​ ఘటనతో కొత్తగా ఆక్రమణలు కూల్చేస్తామని హడావుడి

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్ ​పరిధిలో అక్రమ నిర్మాణాలు కూలినప్పుడు.. ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారు. ఓ వారం, పది రోజుల ‘యాక్షన్’​లోకి దిగుతున్నట్టు ప్రకటనలు ఇవ్వడం, వాటికి సాక్ష్యంగా రెండు, మూడు బిల్డింగులను పడగొట్టేయడం, ..తర్వాత సైలెన్స్​అయిపోవడం ఇక్కడే కాదు మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ సర్వసాధారణమైన విషయం. 

అక్రమ నిర్మాణాలు గుర్తించామని, నోటీసులు ఇచ్చామని.. వాటి పని పడతామని భీకర ప్రకటనలు చేసే ఇక్కడి ఆఫీసర్లు.. ఒక్కోసారి జనాలను నమ్మించడానికి రూల్స్ ​బ్రేక్ ​చేసి కడుతున్న బిల్డింగులను సీజ్​చేసి పడేస్తారు కూడా.. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

కాదు కాదు.. కథకు ఎండ్​కార్డ్​పడుతుంది. సదరు బిల్డింగుల ఓనర్లు ఏం జరగనట్టు ఫ్లెక్సీలను తీసేసి అంతకుముందు అనుకున్న ఫ్లోర్ల కంటే ఓ ఫ్లోర్​ఎక్కువే కట్టేస్తరు. చూడచక్కని రంగులు వేయించి ఓ శుభ ముహూర్తాన గృహ ప్రవేశం పూర్తి చేసి ఏ హాస్టల్​కో, ఓయో రూమ్స్​కో, లేక ఎవరికైనా రెంట్​కు ఇచ్చుకుంటారు. ఆఫీసర్లు మాత్రం ఫీల్డ్​కు వెళ్లి చూడకుండా సీజ్​చేసిన బిల్డింగులను రికార్డుల్లోనే చూస్తూ నెల రాగానే జీతాలు తీసుకుంటారు.

సిద్ధిక్​నగర్​లో జరిగిందిదే.. 
2024 నవంబర్ 19న గచ్చిబౌలి సిద్ధిక్​నగర్ లోని రోడ్​నంబర్​1లో ఓ వ్యక్తి 200 గజాల్లో భారీ నిర్మాణానికి సెల్లార్ తవ్వుతుండగా మట్టి కుంగి పక్కనే ఉన్న ప్లాట్ నంబర్​1639లోని లక్ష్మణ్ 60 గజాల్లో కట్టిన ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో పోలీసులు, హైడ్రా ఆ బిల్డింగులోని ఎనిమిది పోర్షన్లలోని 20 మందిని, పక్క బిల్డింగుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు.

పక్కకు ఒరిగిన బిల్డింగును నేలమట్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన అప్పటి శేరిలింగంపల్లి జోనల్​కమిషనర్​ఉపేందర్​రెడ్డి ‘స్థానికంగాఉన్న మొత్తం అక్రమ నిర్మాణాలను గుర్తిస్తం.. ఎక్కడా మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఒక ప్రకటన చేశారు.

సీజ్ చేశారు.. వదిలేశారు 
జోనల్​కమిషనర్​ మాట ప్రకారం.. టౌన్​ప్లానింగ్​ఆఫీసర్లు నెల పాటు ఫీల్డ్​ విజిట్​ చేసి సిద్ధిక్​నగర్, అంజయ్యనగర్​లలో దాదాపు 32 నుంచి 36 అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇచ్చి సీజ్​కూడా చేశారు. తర్వాత అక్కడికి వెళ్లి చూడాల్సిన అవసరం లేదనుకున్నారో ఏమో.. కన్నెత్తి చూస్తే ఒట్టు.. టౌన్​ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పరోక్షంగా సహకరించడంతో ఆ భవనాల యజమానులు, బిల్డర్లు గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు పూర్తి చేశారు.  చాలా వరకు హాస్టల్స్​కు, ఓయో హోటల్స్, అద్దె ఇండ్లుగా మారిపోయాయి. 

అంజయ్యనగర్​ ఘటనతో మళ్లీ హడావుడి
మూడు రోజుల కింద అంజయ్యనగర్​లో 50 గజాల్లో నాలాపై కట్టిన ఏడంతస్థుల మేడ కుప్పకూలడంతో అధికారులు మళ్లీ నిద్ర లేచారు. ఈ బిల్డింగ్​ పక్కనే ఉన్న మరో మూడు బిల్డింగులు దెబ్బతినడంతో ఆది, సోమవారాల్లో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. మళ్లీ సేమ్ ​సీన్.. సేమ్​ప్రకటనలు..‘అక్రమ నిర్మాణాలను సహించేది లేదు. ఎక్కడ ఎవరు కట్టినా కూల్చేస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

38 అక్రమ నిర్మాణాలు గుర్తించాం 
‘సీఎంసీ పరిధిలో సోమవారం చేపట్టిన తనిఖీల్లో 38 అక్రమ నిర్మాణాలను గుర్తించాం.. వీటిలో అండర్ కన్ స్ర్టక్షన్ లో ఉన్న  28 బిల్డింగులకు నోటీసులు ఇచ్చాం. మరో బిల్డింగ్​ను సీజ్​చేసి పడేశాం. మరో తొమ్మిది భవనాల స్లాబులు కూల్చేశాం. 75 చదరపు గజాల కంటే తక్కువ స్థలాల్లో ఏడు మీటర్లకు మించి ఎత్తులో కడుతున్న ఏ బిల్డింగునూ వదిలేదు లేదు.

75 చదరపు గజాల కంటే ఎక్కువ స్థలాల్లో పర్మిషన్​ లేకుండా కట్టినా యాక్షన్​తప్పదు. ప్రజల  ఫిర్యాదులతో పాటు ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీమ్స్​ తనిఖీలతో అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నాం. భవన నిర్మాణ రూల్స్​ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టేవారిపై చర్యలు తప్పవు’ అని అధికారులు స్పష్టం చేశారు.