రోగుల కష్టాలు పట్టించుకోని అధికారులు

రోగుల కష్టాలు పట్టించుకోని అధికారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటే పట్టణంలోని ఆస్పత్రి స్థాయి కూడా పెరిగింది. జిల్లా ఆస్పత్రి కాస్త జనరల్​ హాస్పిటల్​ అయింది. మెడికల్​ కాలేజీ కూడా రావడంతో ప్రొఫెసర్లు, సీనియర్​ వైద్యులు వచ్చారు. రోజువారీ రోగుల సంఖ్యా పెరిగింది. . ఇక్కడి వరకు బాగానే ఉన్నా. రోగులకు మాత్రం సౌకర్యాలు కరువయ్యాయి. ‘మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. అధునాతన పరికరాలతో ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. కార్పొరేట్ స్థాయిలో మందులను ఫ్రీగా ఇస్తున్నాం’.. అంటూ మంత్రులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెబుతున్నా ఒక్కటీ అమలు కావడంలేదు.

స్థాయికి తగ్గట్టు మందుల్లేవ్..

కొత్తగూడెంలోని జనరల్​ఆస్పత్రిలో ప్రతి రోజు 750 నుంచి 850కిపైగా ఓపీ ఉంటుంది. 250 నుంచి 270 వరకు ఐపీ(ఇన్ పేషెంట్స్)​ ఉంటున్నారు.. ఈ హాస్పిటల్ స్థాయి మెడికల్ కాలేజీ పరిధిలోకి వెళ్లాక వంద పడకల నుంచి 330 పడకలకు చేరింది. కానీ ఆ స్థాయికి తగ్గట్టుకు మందుల బడ్జెట్​పెరగలేదు. గతంలో 300 నుంచి 500 మాత్రమే ఓపీ ఉండేది. రోగులకు తాగేందుకు కనీసం మంచి నీళ్లు లేవు. సెకండ్​ఫ్లోర్​లో ఉన్న రోగులు గ్రౌండ్​ ఫ్లోర్​కు వచ్చి తాగేనీళ్లను తీసుకెళ్లాల్సిన వస్తుంది. అటెండర్స్​లేని రోగుల అవస్థలు ఇక వర్ణనాతీతం. రోగం నయం చేసుకునేందుకు హాస్పిటల్​కు వస్తే ఇక్కడి అవస్థలతో మరింత పెరుగుతుందేమోనని భయమేస్తుందని పలువురు పేషెంట్స్​ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీ పరిస్థితి ఇలా ఉంటే ఓపీ పరిస్థితి మరోలా ఉంది. నమ్మకంతో ఇక్కడికి వస్తే డాక్టర్​రాసిన వాటిల్లో కొన్ని మందులు చాలా వరకు ఇక్కడ అందుబాటులో లేవు. ప్రస్తుతం ఏడాదికి రూ.1.50కోట్ల విలువైన మందులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్​డాక్టర్​లు రాసే మందులు హాస్పిటల్​లో దొరకని పరిస్థితి. ప్రస్తుతం రూ.2 నుంచి రూ.2.50కోట్ల మేర మందులు అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం హాస్పిటల్​లో షుగర్, గ్యాస్, బీపీ, యాంటిబయాటిక్స్, దగ్గు సిరప్, సిట్రిజన్, పారసిటమల్​వంటి మందులు అందుబాటులో లేవు. కేవలం ఇన్​పేషెంట్లకే ఇస్తున్నారు. ఓపీ వాళ్లను బయటనే కొనమని సిబ్బంది సూచిస్తున్నారు. మందులు లేవని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు డాక్టర్లపై సీరియస్​ అవుతున్నారు. ‘ఉన్నవాటినే రాయండి.. లేని మందులను రాయకండి.. బయట కొనుక్కోమని చెప్తే మనకు ఇబ్బంది అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నా. రోగం తగ్గినా తగ్గకున్నా మనకు సంబంధం లేదు’.. అన్నట్లు ఉన్నాతాధికారులు డాక్టర్లను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. జిల్లా ఏర్పడినా డ్రగ్​స్టోరేజీ లేక ఖమ్మం వెళ్లి మందులు తెచ్చుకోవాలి. హైదరాబాద్​నుంచి మందులు రాగానే ఖమ్మంలోని డ్రగ్​స్టోరేజీకి అవసరమైన మందులను తీసుకుంటున్నారు. దాంతో కొత్తగూడెం ఆస్పత్రికి మిగిలిన మందులు వాడుతున్నారు. పూర్తిస్థాయిలో మందులు రాకపోవడమే ఇందుకు కారణం.ఈ విషయాన్ని మీడియాకు చెబితే సీరియస్​గా ఉంటుందని పారామెడికల్ సిబ్బందిని ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

సౌకర్యాలు కల్పిస్తున్నాం.. 

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఫిల్టర్ వాటర్​కింద ఉన్నాయి. పేషెంట్స్​ఉన్న ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడతాం. మందుల కొరత పెద్దగా లేదు. అయిపోతే తెస్తూనే ఉన్నాం. ఏ మందులు లేవో పరిశీలించి ఉంచేలా చూస్తాం. నాణ్యమైన ఫుడ్ ను అందిస్తాం. 

–కుమారస్వామి, సూపరింటెండెంట్, జిల్లా జనరల్ హాస్పిటల్, కొత్తగూడెం

కాంట్రాక్టర్​దే ఇష్టారాజ్యం... 

జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్​లో ఐపీకి పెట్టే భోజనంలో కాంట్రాక్టర్​నాణ్యతకు తిలోదకాలిచ్చినా అధికారులు పట్టించుకోవడంలేదు. క్వాలిటీ లెస్​తో కూడిన భోజనమే రోగులకు పంచభక్ష్య పరమాన్నంగా మారింది. పప్పులో కూరగాయలు, ఆకు కూరతో పాటు ఇతరాలు అందించాలి. వీటినే సాంబారులా చేస్తున్నారు. ఇక సాంబార్​నీళ్ల చారులా ఉంటోంది. కూరలు గరిట వేస్తే ఏం సరిపోతుందంటూ రోగులు​అంటున్నారు. చెడిపోయిన అరటిపళ్లు కూడా బాగాలేనివి ఇస్తున్నారంటున్నారు. రోగులకు పెట్టే భోజనంపై అధికారుల తనిఖీలు లేక కాంట్రాక్టర్​ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.