ముంబై: ముడిచమురు బ్యారెల్ధర వంద డాలర్ల సమీపానికి రావడం, పశ్చిమాసియా సంక్షోభం ముదరడంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కిందికి లాగింది. సెన్సెక్స్ 555.23 పాయింట్లు పడిపోయి 75,577.58 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 144.05 పాయింట్లు కోల్పోయి 23,635.10 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.45శాతం పెరిగి బ్యారెల్కు 98.36 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరత పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు నష్టపోగా, ఆటోమొబైల్, హెల్త్కేర్ రంగాలు లాభపడ్డాయి.
ఎఫ్ఐఐలు సోమవారం రూ.280.13 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నాయి. క్రూడ్దెబ్బకు రూపాయి విలువ 18 పైసలు క్షీణించి 94.74 వద్ద ముగిసింది. యెమెన్ హౌతీల దాడుల నేపథ్యంలో చమురు సరఫరా ఆందోళనలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత కొనసాగుతున్నందున రానున్న రోజుల్లో రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ నెల 18న ఎన్ఎస్ఈ ఐపీఓ..?
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) రూ.30 వేల కోట్ల విలువైన ఐపీవో ఈ నెల 18–22 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. షేర్లు 25న స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 15న ప్రైస్ బ్యాండ్ ప్రకటన రావొచ్చు. సెప్టెంబర్ 17న యాంకర్ బుక్ ప్రక్రియ జరగనుంది. ఈ మెగా ఇష్యూ ద్వారా కంపెనీ కొత్త షేర్లను జారీ చేయడం లేదు. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలోనే 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. హ్యుందాయ్ మోటార్ రూ.27,870 కోట్ల ఐపీవో రికార్డును ఎన్ఎస్ఈ అధిగమించనుంది.
