న్యూఢిల్లీ: రష్యన్ ఆయిల్ కంపెనీలు రోస్నెఫ్ట్, లుకోయిల్పై అమెరికా ఆంక్షలు పెట్టడంతో, ఇండియా మిడిల్ ఈస్ట్, యూఎస్ నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. భారత రిఫైనరీలు రష్యా నుంచి నేరుగా వచ్చే క్రూడ్ ఆయిల్ను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయని అన్నారు.
రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్ వరకు ఆయిల్ను రోస్నెఫ్ట్, లుకోయిల్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. నవంబర్ 21 తర్వాత ఈ సరఫరాలు తగ్గే అవకాశం ఉంది. రిలయన్స్ తన 25 ఏళ్ల ఒప్పందాన్ని తిరిగి పరిశీలిస్తూ, థర్డ్ పార్టీ ద్వారా కొనుగోళ్లు చేయనుంది. నయార ఇప్పటికే రష్యన్ ఆయిల్పై ఆధారపడుతోంది.
మిగతా రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, అమెరికా, వెస్ట్ ఆఫ్రికా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్నాయి. అయితే, అధిక రవాణా ఖర్చులు లాభాలను తగ్గించొచ్చు. ‘‘రష్యా ఆయిల్ పూర్తిగా నిలిపివేయడం అసాధ్యం. భారత రిఫైనరీలు వివిధ గ్రేడ్లను ప్రాసెస్ చేయగలవు. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు థర్డ్ పార్టీలు, ఇంటర్మీడియరీస్ ద్వారా కొనసాగుతాయి. ప్రభుత్వ పరంగా నిషేధం లేకపోతే, రష్యన్ ఆయిల్ ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది”అని ఎనలిస్టులు వివరించారు.
