న్యూఢిల్లీ: ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్ భక్షి బాధ్యతలు తీసుకొని నాలుగు నెలలు కూడా కాకముందే తన పదవికి రాజీనామా చేశారు. ఈ కంపెనీ సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తీసేయాలని ప్లాన్ చేస్తోంది. రీస్ట్రక్చరింగ్ చేయడానికి రెడీ అయ్యింది. ఓలా క్యాబ్స్ సీఈఓగా ఈ ఏడాది జనవరిలో భక్షి జాయిన్ అయ్యారు. ‘ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్ భక్షి కంపెనీ నుంచి వెళ్లిపోతున్నారు.
భవిష్ అగర్వాల్ టెంపరరీ సీఈఓగా పనిచేస్తారు. త్వరలో కొత్త అపాయింట్మెంట్ ఉంటుంది’ అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఓలా క్యాబ్స్ ఐపీఓకి రావాలని చూస్తుండగా, తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో చర్చలు జరిపింది. ఈ చర్చలు జరిగిన కొన్ని వారాల్లోనే కంపెనీ సీఈఓ రాజీనామా చేయడం గమనించాలి. గత నెల రోజుల్లో టాప్ మేనేజ్మెంట్ను ఓలా క్యాబ్స్ మార్చింది. సీఎఫ్ఓగా కార్తిక్ గుప్తాను, సీబీఓగా సిద్ధార్ధ్ శక్ధర్ను నియమించింది.