ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేసేందుకు నైట్‌ కర్ఫ్యూ తప్పదు

ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేసేందుకు నైట్‌ కర్ఫ్యూ  తప్పదు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరోసారి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. అంతా నార్మల్‌ లైఫ్‌లోకి వెళ్లబోన్నామనుకున్న టైమ్‌లో ఈ వేరియంట్ చుట్టుముడుతోంది. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇమ్యూనిటీని సైతం ఛేదించి వైరస్ అంటుకుంటుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. వ్యాక్సిన్లు కూడా అడ్డుకోలేకపోవచ్చని చెబుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తుందా? మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా? అన్న టెన్షన్ జనాన్ని చుట్టుముట్టేస్తోంది. భారత్‌లో కరోనా మహమ్మారి గ్రాఫ్‌ను మ్యాథమేటికల్‌గా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సూత్ర’ గ్రూప్‌ కో ఫౌండర్,  ఐఐటీ కాన్పూర్‌‌ ప్రొఫెసర్ మణింద్ర అగర్వాల్‌ ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేలా తమ స్టడీ వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య కరోనా థర్డ్ వేవ్ పీక్‌కు చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ థర్డ్ వేవ్ ఎక్కువ తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు.

భయం అక్కర్లే.. ఒమిక్రాన్‌కు అంత సీన్‌ లేదు

ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు వచ్చే ఏడాది తొలినాళ్లలో పీక్‌కు చేరుతాయని తమ స్టడీలో తేలిందని మణింద్ర అగర్వాల్‌ చెప్పారు. అయితే ఈ వేరియంట్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచించారు. అయితే ఒమిక్రాన్‌పై సౌతాఫ్రికా రీసెర్స్‌కు భిన్నంగా మణింద్ర అగర్వాల్ టీమ్ అధ్యయన ఫలితాలు ఉన్నాయి. ఈ వేరియంట్ రోగ నిరోధక శక్తిని ఛేదించి, వైరస్ సోకే ప్రమాదం ఉందన్న సౌతాఫ్రికా రీసెర్చ్‌ను కొట్టిపారేశారు అగర్వాల్. ఇమ్యూనిటీని బైపాస్‌ చేసే శక్తి  ఒమిక్రాన్‌కు లేదని పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కడా క్రిటికల్ కండిషన్‌కు చేరిన దాఖాలాలు లేవని చెప్పారు. ఇప్పటి వరకూ సేకరించిన డేటా ఆధారంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. వైరస్ సోకిన తర్వాత తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు.

లాక్‌డౌన్‌ పెట్టాల్సిందేనా?

దేశంలో థర్డ్ వేవ్ రావడం దాదాపు ఖాయమని మణింద్ర అగర్వాల్ తెలిపారు. అయితే ఈ థర్డ్ వేవ్ ఏ స్థాయిలో ఉంటుందన్నది ప్రభుత్వాలు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా కంట్రోల చేసేందుకు తేలికపాటి ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్స్‌ తప్పవని పేర్కొన్నారు. కేసులు భారీగా పెరిగిపోకుండా ఉండేందుకు గుంపులు కంట్రోల్ చేసేందుకు మీటింగ్‌లు, సంబురాలపై ఆంక్షలు, నైట్‌ కర్ఫ్యూలు విధిస్తే మేలని సూచించారు.