- ఆస్పత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం కేటాయింపు
- ముప్పున్న 12 దేశాల ప్యాసింజర్లకు ఎయిర్పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్
- పాజిటివ్ వస్తే ఒమిక్రాన్ వార్డులో ఐసోలేషన్
- మిగతా దేశాల వాళ్లకు రూల్స్ నుంచి మినహాయింపు
- ఎల్లుండి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే కరోనా పేషెంట్ల కోసం టిమ్స్లో ఆరోగ్య శాఖ ‘ఒమిక్రాన్ వార్డు’ను ఏర్పాటు చేయనుంది. అందుకోసం ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తాన్ని కేటాయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోని 12 ఎట్ రిస్క్ (ముప్పున్న) దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి.. పాజిటివ్ వస్తే టిమ్స్కు తరలించనుంది. వేరియంట్ తేలేవరకు పేషెంట్లందరికీ అక్కడే ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించింది. బ్రిటన్, ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్లకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని అధికారులు చెప్పారు. ఆ దేశాల నుంచి వచ్చేటోళ్లు నెగటివ్ సర్టిఫికెట్ చూపించినా, రెండు డోసుల వ్యాక్సిన్ను తీసుకున్నా.. ఇక్కడ దిగాక మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. బుధవారం నుంచి ఈ కొత్త రూల్ను అమల్లోకి తీసుకురానున్నారు.
నెగెటివ్ వస్తే ఇంట్లోనే..
ఎయిర్పోర్టులో చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్లో ఉంచనున్నారు. వాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా లోకల్ పోలీసుల సాయంతో హెల్త్ ఆఫీసర్లతో నిఘా పెడ్తామని అధికారులు చెప్పారు. వారం తర్వాత మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి, నెగటివ్ వస్తే క్వారంటైన్ నుంచి రిలీవ్ చేస్తామన్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే టిమ్స్కు తీసుకెళ్లి.. ఇంట్లో వాళ్లను క్వారంటైన్ చేస్తామని తెలిపారు. అందరి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని నిర్ణయించారు.
టెస్ట్ చేయకుండానే పంపించిన్రు
ముప్పున్న జాబితాలోని బ్రిటన్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్లో సోమవారం 223 మంది ప్రయాణికులు వచ్చారు. వాళ్లందరికీ ఎయిర్పోర్టులో టెస్టులు చేయకుండానే పంపించారు. దీనిపై హెల్త్ ఆఫీసర్లను ఆరా తీయగా కొత్త రూల్స్ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం సూచించిందని చెప్పారు. బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లందరి వద్ద కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉందని, చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎట్ రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చినోళ్లకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా పాత రూల్సే ఉంటాయన్నారు. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందున్నారు. వాళ్లకు ఎలాంటి టెస్ట్ చేయకుండానే ఇంటికి పంపించనున్నారు.