పాముని నమ్మవచ్చు కానీ బీజేపీని నమ్మలేమన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. లోక్ సభ ఎన్నికల వేళ ఏప్రిల్ 04న జరిగిన కూచ్ బెహార్లో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ బీజేపీ ఆదేశానుసారం పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు మమత. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్ఐఎ,ఐటీ, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్లు బీజేపీ కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు.
కేంద్ర సంస్థల బెదిరింపులకు తమ పార్టీ తలొగ్గదని తేల్చి చెప్పారు సీఎం మమతా బెనర్జీ. బీజేపీ ఒకే దేశం, ఒకే పార్టీ అనే సూత్రాన్ని మాత్రమే బీజేపీ అనుసరిస్తోందని బెనర్జీ విమర్శించారు. ప్రజల తీర్పును తుంగలో తొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఓటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడే వరకు ఈవీఎంలను కాపలా పెట్టాలని ప్రజలను కోరారు.
సీఏఏకు సంబంధించి కాషాయ పార్టీ అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏప్రిల్ 19 న జరగనున్న ఎన్నికలకు ముందు బీఎస్ఎఫ్ స్థానికులను హింసించిన సందర్భాలు ఉంటే పోలీసు ఫిర్యాదులు చేయాలని కూచ్ బెహార్లోని మహిళలను బెనర్జీ కోరారు.