భారత్‌పై స్పెషల్ ఆపరేషన్‌కు చైనా ప్లాన్?

భారత్‌పై స్పెషల్ ఆపరేషన్‌కు చైనా ప్లాన్?

గల్వాన్ వ్యాలీలో సైనికుల ఘర్షణతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ పరిస్థితుల్లో కొంత మేర మార్పు వచ్చినట్లే కనిపించింది. సైనిక, దౌత్య చర్చలు సఫలం కావడంతో ఇరు దేశాల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) నుంచి తమ సైన్యాలను వెనక్కి తీసుకున్నాయి. కానీ చైనా మాత్రం వెనక్కి తగ్గనట్లే కనిపిస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి మరింత మంది సైనికులను మోహరించాలని భావిస్తున్న చైనా.. అందులో భాగంగా కొత్తగా జవాన్ల రిక్రూట్‌మెంట్‌ను మొదలుపెట్టింది. అది కూడా తమ అధీనంలోని టిబెట్‌‌లో రిక్రూట్‌మెంట్ చేస్తోంది.  

ప్రతి ఇంటి నుంచి ఒకరు ఆర్మీలోకి రావాలని టిబెటన్లను చైనా ఆదేశించినట్లు సమాచారం. టిబెట్ యూత్‌కు ఫిజికల్ టెస్టులు నిర్వహించి వారిని పీఎల్‌ఏలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండే లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారీగా సైన్యాన్ని మోహరించాలని చైనా యోచిస్తోందని సమాచారం. టిబెట్‌లో తమకు విశ్వాసంగా ఉండే వ్యక్తుల కుటుంబాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరిని ఆర్మీలోకి రిక్రూట్ చేసుకునే ప్రక్రియను చైనా ఆరంభించిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలా రిక్రూట్ చేసుకున్న వారిని భారత్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శాశ్వతంగా మోహరిస్తారని తెలుస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి స్పెషల్ ఆపరేషన్ కోసం టిబెట్ యువతను రిక్రూట్ చేసుకొని, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని సమాచారం.