ముంబై: టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు బాంబే హైకోర్టు సోమవారం భారీ రిలీఫ్ ఇచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం వీరిపై విధించిన వన్-టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల (ఓటీఎస్సీ) ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ వివాదాస్పద డిమాండ్ల ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు, జారీ చేసిన ఆర్డర్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.
బాంబే హైకోర్టు తీర్పుతో ఈ రెండు కంపెనీలకు కలిపి దాదాపు రూ. 20 వేల కోట్ల మేర ఊరట లభించింది. ఇందులో వొడాఫోన్ ఐడియాకు రూ. 11 వేల కోట్లు, భారతీ ఎయిర్టెల్కు రూ. 9 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది.
కంపెనీలు ఈ వివాదానికి సంబంధించి ప్రభుత్వానికి సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీలను తక్షణమే తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వ్యవహారం ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
