
న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో రూ.4,600 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. 10 డెవలప్మెంట్ వెల్స్ తవ్వడానికి, కేజీ బేసిన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి ఈ ఫండ్స్ వాడనుంది. కంపెనీ రెండు మానవరహిత ప్లాట్ఫారమ్లు, ఆఫ్షోర్ పైప్లైన్, ఆన్షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కొత్త అనుమతులు కోరింది. ఈ ఏడాది జులై 24న జరిగిన ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించారు. చంద్రిక (697 చ.కి.మీ), జీఎస్49 (148 చ.కి.మీ) ఆఫ్షోర్ బ్లాక్లకు 2022 సెప్టెంబర్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ నుంచి ఓఎన్జీసీ లైసెన్స్లు పొందింది.
ఈ ప్రాజెక్ట్కు 26.3 హెక్టార్ల భూమి (ఒడల రేవు టెర్మినల్) అవసరం. 8.7 హెక్టార్లలో గ్రీన్బెల్ట్ అభివృద్ధి చేస్తారు. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) కోసం రూ.14 కోట్లు ఖర్చు చేయనున్నారు. కార్పొరేట్ బాధ్యతకు రూ.14 కోట్లు కేటాయిస్తారు. 150 ప్రత్యక్ష, 310 పరోక్ష ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా. ఈఏసీ మరిన్ని వివరాలు కోరుతూ ప్రతిపాదనను వాయిదా వేసింది. జీవవైవిధ్య అంచనా, పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఓఎన్జీసీకి సూచించింది.