వెలుగు బిజినెస్ డెస్క్: మన దేశంలో ఆన్లైన్ వ్యాపారం 2024 నాటికి 99 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది. 2019–24 మధ్య కాలంలో ఈ వ్యాపారం ఏటా 27 శాతం చొప్పున పెరుగుతుందని ఈవై–ఐవీసీఏ ట్రెండ్ బుక్ రిపోర్టు పేర్కొంది. గ్రోసరీ (కిరాణా), ఫ్యాషన్, అపారెల్ (దుస్తులు) ...ఈ మూడు సెగ్మెంట్స్ ఆన్లైన్ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపింది.2025 నాటికి మన దేశంలో 220 మిలియన్ల ఆన్లైన్ షాపర్లు ఉంటారని ఈ రిపోర్టు పేర్కొంది. 2019 నాటికి 4.7 శాతంగా ఉన్న రిటెయిల్ సెగ్మెంట్ 2024 నాటికి 10.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా 2025 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆన్లైన్ ఎకానమీ తేవాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తోందని వివరించింది. మొత్తం ఆర్గనైజ్డ్ మార్కెట్లో ఆన్లైన్ రిటెయిల్ మార్కెట్ వాటా దాదాపు 25 శాతం. ఈ రిటెయిల్ మార్కెట్ 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని అంచనా. కొత్తగా వస్తున్న ఆన్లైన్ యూజర్లలో ఎక్కువ మంది టైర్2, టైర్ 3 సిటీల నుంచే వస్తున్నారు. దేశీ స్టార్టప్ కంపెనీలకు ఇదొక వరంగా మారే అవకాశం ఉంది. స్మాల్, మీడియం బిజినెస్లు కూడా ఆన్లైన్ బాట పడుతున్నాయని, ఈ సెగ్మెంట్ వల్ల కూడా డిజిటల్ స్టార్టప్స్ ఎదుగుదలకు వీలు కల్పిస్తాయని రిపోర్టు వెల్లడించింది. ఆన్లైన్ పేమెంట్స్, మొబైల్ చానల్స్ ఏర్పాటు చేసుకుంటున్న చిన్న వ్యాపారులందరూ టెక్నాలజీ స్టార్టప్స్తో కలిసి పనిచేసేందుకు చూస్తున్నారని వివరించింది. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్నోవేషన్ ఫండ్, భారత్ నెట్ వంటి ప్రోగ్రామ్స్తో ఆఫ్లైన్ మార్కెట్ను ఆన్లైన్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.
మలి దశ ఆన్లైన్ వ్యాపారంలో టైర్2, టైర్ 3 సిటీల నుంచి ఎక్కువ గ్రోత్ రానుంది. కొత్తగా వచ్చే వందలాది మిలియన్ల కన్జూమర్లు ఇక్కడ నుంచే రానున్నారు. ఆన్లైన్ వ్యాపారంలో కొత్త పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.బీటూ బీ, బీ2సీ సెగ్మెంట్స్ రెండింటిలో పెద్ద గిగ్ ఎకానమీ రాబోతోంది.
- కార్తీక్ రెడ్డి, వైస్ చైర్మన్, ఐవీసీఏ