
హనుమకొండ, వెలుగు: చదివింది నాలుగో క్లాసే.. అయినా ఆన్ లైన్ బెట్టింగుల్లో ఆరి తేరాడు. ముంబైకి చెందిన బుకీలతో చేతులు కలిపి మూడు నెలల నుంచి రూ.కోట్లల్లో దందా చేశాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. ఆన్ లైన్ బెట్టింగులతో కోట్లలో మోసం చేసిన వరంగల్కు చెందిన వ్యక్తితోపాటు మహారాష్ట్రకు చెందిన మరొకరిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ.2.05 కోట్ల నగదుతో పాటు 8 సెల్ ఫోన్లు, 43 బ్యాంక్ పాస్ బుక్లు, 15 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులన వివరాలను వరంగల్ సీపీ డాక్టర్తరుణ్ జోషి సోమవారం వెల్లడించారు. కరీంనగర్ టౌన్కు చెందిన మాడిశెట్టి ప్రసాద్హనుమకొండలోని గోపాలపూర్లో ఉండేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ హఫీజ్పేటకు షిఫ్ట్ అయి.. రెడీ మేడ్ బట్టల వ్యాపారం చేసేవాడు. తనకొచ్చే ఆదాయం సరిపోక ఈజీ మనీ కోసం ప్రయత్నించాడు. హఫీజ్ పేటలోని కొందరు ఫ్రెండ్స్తో కలిసి 2016 నుంచి క్రికెట్ బెట్టింగులు మొదలుపెట్టాడు. 2018 నుంచి ఆన్లైన్ క్రికెట్, పేకాట బెట్టింగులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రసాద్కు ముంబైలో బెట్టింగులు నిర్వహించే మహారాష్ట్ర యావత్ మాల్ జిల్లా చోరియా టౌన్ షిప్కు చెందిన అభయ్ విలాస్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా బెట్టింగ్లపై పట్టు సాధించి.. తానే తెలుగు రాష్ట్రాల్లో బుకీగా అవతారమెత్తాడు.
జైలుకు వెళ్లినా మార్పు రాలే
బెట్టింగులకు పాల్పడిన ప్రసాద్తో పాటు మరో ఇద్దరిని 2019లో చందానగర్, రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్ నుంచి తన మకాం అత్తగారుండే హనుమకొండ జిల్లా గోపాలపురానికి మార్చాడు. ఇక్కడ నుంచి ఐపీఎల్, టీ20 వర్డల్ కప్ తో పాటు పేకాట బెట్టింగ్ కొనసాగించాడు. తక్కువ అమౌంట్ కాసిన వారిని ఆకట్టుకునేందుకు ఈ ముఠా సభ్యులు భారీగా చెల్లించి..ఎక్కువ అమౌంట్ బెట్ కాసేలా ఎంకరేజ్ చేసేవారు. ఎక్కువ మొత్తం కాయగానే వాళ్లను మోసగించి.. నిండా ముంచేవాళ్లు హనుమకొండ కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని, హనుమకొండ పీఎస్ పరిధిలో ఒకరిని ఇలా మోసం చేశారు. ఆ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో కేయూసీ సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు.బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు అభయ్ సోమవారం ఉదయం హనుమకొండలోని ప్రసాద్ ఇంటికి రాగా.. కేయూసీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఐ జనార్ధన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన రూ.2 కోట్ల 5 లక్షల 14 వేల తో పాటు బ్యాంక్ పాసు బుక్లు, ఏటీఎం కార్డులు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సాల్వ్చేసిన డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, కేయూ సీఐ జనార్ధన్ రెడ్డి, ఎస్సై సంపత్, ఏఏవోలు ప్రశాంత్, సల్మాన్షా, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు రత్నాకర్, అశోక్, మధు, జగదీష్ తదితరులను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి అభినందించారు.
బాల్ టు బాల్ బెట్టింగ్
అభయ్ తో పాటు ముంబైకి చెందిన మరికొంతమంది క్రికెట్ బెట్టింగులకోసం ఓ వెబ్ సైట్ నిర్వహించేవారు. యూత్ను అట్రాక్ట్ చేసి వారికి వాట్సాప్ ద్వారా వెబ్సైట్ లింకులు పంపి ప్రతి మ్యాచ్కు సంబంధించి .. ఓవర్ టు ఓవర్, బాల్ టు బాల్ బెట్టింగులు నిర్వహించేవారు. క్రీజ్ లో ఉండే బ్యాట్స్ మెన్, బౌలర్ల మీద కూడా బెట్టింగ్చేయించేవారు. ఒక్కోసారి వెయ్యి బెట్ పెడితే లక్ష వరకు వస్తాయని నమ్మించేవారు. టీ20 వరల్డ్ కప్, న్యూజీలాండ్, ఇండియా మ్యాచ్ లకు సంబంధించి జోరుగా బెట్టింగ్ చేశారు. బెట్ కాసిన వారికి కొందరికి డబుల్, మరికొందరికి పది రెట్ల అమౌంట్ చెల్లించేవారు. ఒకేసారిభారీగా అమౌంట్ వస్తుండటంతో చాలామంది ఆన్ లైన్ క్రికెట్, పేకాట బెట్టింగులకు అలవాటు పడ్డారు. ముంబై నిర్వాహకులు ప్రసాద్కు మొత్తంలో కమీషన్ ఇచ్చేవారు. బెట్టింగ్ చేయాలనుకునేవారు నగదుగా లేదంటే ఆన్లైన్లో ప్రసాద్కు డబ్బులిస్తే వారికి వెబ్సైట్లింక్ పంపేవాడు. రోజువారీ లావాదేవీల ప్రకారం తన కమీషన్ తీసుకుని మిగతా అమౌంట్ బుకీ అయిన అభయ్ కు పంపేవాడు. ఈ దందాలో క్యాష్ రొటేషన్ కోసం ప్రసాద్ తన బంధువుల పేరున బినామీ అకౌంట్లు మెయింటేన్ చేసేవాడు. ఇలా వచ్చిన డబ్బులతో ప్రసాద్ ప్లాట్లు కొన్నాడు.