- శిబు సోరెన్ సహా 28 పార్టీల నేతల హాజరు
రాంచీ : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్కు నిరసనగా ఆదివారం విపక్ష ఇండియా కూటమి రాంచీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ‘ఉల్గులన్ న్యాయ్’ (తిరుగుబాటు న్యాయ మహార్యాలీ) పేరుతో ప్రభాత్ తారా గ్రౌండ్లో నిర్వహించిన ఈ మెగా ర్యాలీలో 28 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వేదికపై కేజ్రీవాల్, హేమంత్ సోరెన్కు ఖాళీ కుర్చీలు వదిలేశారు. అందులో వారి సతీమణులు సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ ఆసీనులయ్యారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు హేమంత్ సోరెన్ మాస్కులతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జైలు గోడలు బద్ధలవుతాయ్.. హేమంత్ సోరెన్ విడుదలవుతాడు’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ‘జార్ఖండ్ ఎవరికీ తలవంచదు’ అనే నినాదాలతో ఆ ర్యాలీ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ ర్యాలీలో కల్పనా, సునీతాతోపాటు జేఎంఎం అధినేత శిబు సోరెన్, ఎన్సీ ప్రెసిడెంట్ ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్సులిన్ ఇవ్వకుండా చంపే కుట్ర: సునీత
బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. జైల్లో ఇన్సులిన్ ఇవ్వకుండా తన భర్తను చంపేందుకు కాషాయ పాలకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ తప్పూ చేయకున్నా తన భర్తను అరెస్ట్ చేసి, జైల్లో పెట్టారని అన్నారు. ‘మేం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ త్వరలోనే బయటకు వస్తారు’ అని అన్నారు.
హేమంత్ సోరెన్ లేఖ చదివిన కల్పన
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, కానీ ప్రజాస్వామ్యాన్ని తాము విఫలం కానివ్వబోమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. జైలునుంచి హేమంత్ రాసిన లేఖను ఆయన భార్య కల్పనా సోరెన్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా కల్పనా మాట్లాడుతూ.. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ను సరిగ్గా ఎన్నికల ముందే జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు. కాగా, బీజేపీని నిర్మూలించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తెలిపారు.