న్యూఢిల్లీ: వీబీ–జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం పార్లమెంటు ముందు ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ‘మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏ’ అనే భారీ బ్యానర్ తో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రేరణ స్థల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఏన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీఎంకేకు చెందిన కనిమోళి, టీఆర్ బాలు, ఎ.రాజా, ఐయూఎంఎల్కు చెందిన ఈటీ మహమ్మద్ బషీర్, శివసేన (యూబీటీ)కి చెందిన అరవింద్ సావంత్, ఆర్ఎస్పీకి చెందిన ఎన్కే ప్రేమ్చంద్రన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ సోనియా గాంధీ కూడా ఎంపీలతో కలిసి మకర ద్వారం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని పార్లమెంట్ చూస్తున్న ది. ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా వారు ప్రజాస్వామ్య విలువలను అలాగే జాతిపిత భావజాలాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు.
