డాక్టర్లు.. పేషెంట్లకు జెనరిక్ మందులే రాయాలని, ఫార్మా కంపెనీల నుంచి గిఫ్ట్ లు తీసుకుంటే బ్యాన్ విధిస్తామని, ఏదైనా మెడిసన్ని ప్రమోట్ చేయాలని చూసినా చర్యలు తీసుకుంటామని ఇటీవల నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలిచ్చింది.
తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆగస్టు 24న వెల్లడించింది. కమిషన్ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలంటూ ఇండియన్ మెడికల్అసోసియేషన్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ చేసిన వినతితో ఆదేశాలు నిలిపివేసింది.
నేషనల్ మెడికల్ కమిషన్ – 2023 పేరుతో విడుదల చేసిన ఆదేశాలను వెంటనే నిలిపేస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.
బ్రాండెడ్ ఔషధాల కంటే జనరిక్ ఔషధాలు 30 నుంచి 80 శాతం చౌకగా లభిస్తాయని ఈ నిర్ణయంతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గుతాయని కమిషన్ భావించింది. ఈ నిర్ణయం వెలువరించినప్పటి నుంచి ఎన్ఎంసీ ఉత్తర్వులను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు.
ఇండియాలో జెనరిక్ ఔషధాల నాణ్యత, నియంత్రణ బలహీనంగా ఉందని, అలాంటి నిబంధనలు రోగులకు ప్రమాదం కలిగిస్తాయని వైద్యులు వాదించారు. ఈ క్రమంలో కమిషన్ తాజాగా తన నిర్ణయం ప్రకటించింది.