విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’కి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. పీవీపీ, దిల్ రాజు కలిసి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిన్న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
విశ్వక్ వ్యక్తిత్వానికి ఫ్యాన్
ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఎంగేజింగ్గా, కామెడీగా ఉంది. వెంకటేష్ గారు చేసిన రోల్కి చాలా ఇంపాక్ట్ ఉంది. మిథిలా పాల్కర్ ఓటీటీ సూపర్ స్టార్. ఆమెకి నా వైఫ్ (ఉపాసన) ఫ్యాన్. అతి తక్కువ టైమ్లో ఎక్కువ హిట్లు కొట్టిన విశ్వక్ సేన్కి గల్లీగల్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. తన వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి కానీ వ్యక్తిత్వమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అది విశ్వక్కి నిండుగా ఉంది. దీపావళికి వస్తున్న ఈ మూవీ కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు.
ప్రతి ఒక్కరి హార్ట్ను కదిలించే సినిమా
విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘అశ్వత్ అమేజింగ్ స్టోరీ రాశాడు. ఫ్యామిలీ, ఫీల్ గుడ్ ఫిల్మ్ అని చెప్పను కానీ.. ప్రతి ఒక్కరి హార్ట్ను కదిలించే సినిమా అవుతుంది. అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు. ఈ సినిమాతో దీపావళికి డబుల్ ధమాకా అందుకుంటారన్నారు హీరోయిన్స్ ఆశాభట్, మిథిలా. ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాడు అశ్వత్. వెంకటేష్ కాకుమాను, నాగినీడు, మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక తదితరులు పాల్గొన్నారు.