
అమ్మాయిలను పంపించుమన్నడు
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజిన్ డెయిరీ నిర్వాహకుల ఆరోపణలు
యువతుల ఫొటోలు, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు వైరల్
ఖండించిన ఎమ్మెల్యే
మంచిర్యాల, వెలుగు : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను మోసం చేశాడని, తన వద్దకు అమ్మాయిలను పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని ఆరిజిన్డెయిరీ నిర్వాహకులు ఆదినారాయణ, శేజల్ ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించాడన్నారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు సహకరించినందుకుగానూ బిజినెస్లో తనవాళ్లకు వాటా కోరడమే గాకుండా తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్కే అమ్మాయిలను పంపించినట్టు ఆదినారాయణ ఆరోపించాడు. దీనికి సంబంధించి చిన్నయ్య 91606 13141 ఫోన్ నంబర్ నుంచి అమ్మాయిలను ‘ట్యాబ్లెట్’ అంటూ కోడ్ లాంగ్వేజ్లో చేసిన వాట్సాప్ చాటింగ్ గా పేర్కొంటూ కొన్ని స్ర్కీన్ షాట్లు, యువతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే తీరుపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరినట్టు తెలిసింది.
డెయిరీ నిర్వాహకులపై కేసులు..
హైదరాబాద్లో నివాసం ఉండే ఆదినారాయణ నిరుడు ఆగస్టులో బెల్లంపల్లిలో ఆరిజిన్ డెయిరీ ప్రారంభించారు. కన్నాల శివారులో నేషనల్ హైవే 363 పక్కన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణానికి ఎమ్మెల్యే చిన్నయ్య, అప్పటి యానిమల్ హస్బెండరీ జేడీ శంకర్తో కలిసి భూమిపూజ చేశారు. యూనిట్ కోసం రెండెకరాల అసైన్డ్ భూమినీ చిన్నయ్యే ఇప్పించాడని ప్రచారం జరిగింది. బర్రెల యూనిట్లు ఇస్తామని ఆదినారాయణ, శేజల్ తమ నుంచి రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేసి మోసగించారని పలువురు పాడిరైతులు ఈ ఏడాది జనవరిలో నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదినారాయణ, శేజల్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు రిమాండ్కు తరలించారు. ఇటీవలే బెయిల్పై రిలీజైన వారు ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆరోపణలు చేస్తూ వాట్సాప్ చాటింగ్ లిస్ట్ బయటపెట్టారు. డబ్బులు అడిగితే ఇవ్వనందుకే తమపై అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. తనను వేధింపులకు గురిచేశాడంటూ శేజల్ సోమవారం ఓ ఆడియో రికార్డ్ కూడా రిలీజ్ చేసింది.
గిట్టనివారు చేస్తున్న కుట్ర
ఆరిజిన్ డెయిరీ నిర్వాహకులు నాపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. సబ్సిడీపై గేదెల యూనిట్లు ఇస్తామని చెప్పి బెల్లంపల్లి ప్రాంతంలో చాలామంది రైతుల దగ్గర రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేశారు. యూనిట్లు ఇవ్వకుండా రైతులను మోసగించారు. బాధిత రైతులు నన్ను సంప్రదించడంతో డెయిరీ నిర్వాహకులను పోలీసులకు పట్టిచ్చిన. పోలీసులు చట్ట ప్రకారం కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ చాటింగ్లతో నాకు సంబంధం లేదు. నేనంటే గిట్టనివారు రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర ఇది.
- దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే