జాబ్ చేస్తూనే ఇంజినీరింగ్ చదవచ్చు

జాబ్ చేస్తూనే ఇంజినీరింగ్ చదవచ్చు
  • అవకాశం కల్పించనున్న ఉస్మానియా యూనివర్సిటీ
  • ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం
  • వర్కింగ్ ప్రొఫెషనల్స్​కు 4 యూజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు

ఓయూ, వెలుగు : ఇంజినీరింగ్ లో డిప్లొమా ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా బ్యాచిలర్  ఆఫ్  ఇంజినీరింగ్  డిగ్రీ పొందవచ్చు. ఇప్పటి వరకు ఇంజినీరింగ్  పీజీ కోర్సులు, లా డిప్లొమా కోర్సుల్లో వర్కింగ్​ ప్రొఫెషనల్స్​కు మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ.. ఈ ఏడాది నుంచి వర్కింగ్  ప్రొఫెషనల్స్ కోసం అండర్ గ్రాడ్యుయేట్  స్థాయిలో ఆర్టిఫిషియల్​ ఇంజినీరింగ్, మెషీన్​ లర్నింగ్, సివిల్, మెకానికల్  ఇంజినీరింగ్  కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనుంది. ఇంజినీరింగ్​ డిగ్రీ కోర్సుల్లో  అటు జాబ్​ చేస్తూనే చదువుకునే అవకాశాన్ని కల్పించనుంది. 

దీనికి సంబంధించి ఇప్పటికే  ఆలిండియా కౌన్సిల్  ఫర్  టెక్నికల్  ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి పొందిన వర్సిటీ.. ఈ విద్యా సంవత్సరం నుంచి కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్​ జారీ చేసేందుకు ఓయూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్  ఇంజినీరింగ్  కామన్ ఎంట్రన్స్  టెస్ట్  ద్వారా పాలిటెక్నిక్​ డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ హోల్డర్ల కోసం ఇంజినీరింగ్ కళాశాలలు బీఈ, బీటెక్​ కోర్సుల్లో  ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. 

అయితే, ఇవి రెగ్యులర్ కోర్సులు. వర్కింగ్ ప్రొఫెషనల్స్​కు ఈ కోర్సుల్లో చేరే అవకాశం లేదు. కానీ, డిప్లొమా పూర్తిచేసి బీఈ, బీటెక్​కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సంబంధిత అర్హత పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా ట్యూషన్​ ఫీజులు కట్టలేక  ఇంజినీరింగ్  పూర్తిచేయలేకపోతున్నారు. ఉద్యోగం చేస్తూ డిగ్రీ సంపాదించడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు, వర్కింగ్ ప్రొఫెషనల్స్  ఉన్నత విద్యను కొనసాగించడానికి ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ.. ఆలిండియా కౌన్సిల్​ ఫర్​ టెక్నికల్ ఎడ్యుకేషన్​(ఏఐసీటీఈ) కు దరఖాస్తు చేసింది. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏఐసీటీఈ ఈ కోర్సును నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి కోర్సులో 30 సీట్లు

వర్కింగ్​ ప్రొఫెషనల్స్​ కోసం ఓయూ నిర్వహిస్తున్న  నాలుగు కోర్సుల్లో ప్రతి కోర్సులో 30 మంది విద్యార్థులకు అడ్మిషన్లు  కల్పించనున్నారు. యూనివర్సిటీ నిర్వహించే ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్, మెషీన్​ లర్నింగ్ కోర్సుల్లో చేరేందుకు ఏదైనా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే సివిల్, మెకానికల్  ఇంజినీరింగ్  కోర్సులకు సంబంధిత సివిల్, మెకానికల్​ డిప్లొమా  చేసి ఉండాలి. 

ఈ కోర్సుల్లో చేరాలనుకునే వర్కింగ్​ ప్రొఫెషనల్స్ తాము​జాబ్​ చేస్తున్న సంస్థ నుంచి నోఅబ్జెక్షన్​ సర్టిఫికెట్​తీసుకొని వర్సిటీకి అందజేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నిర్వహించే ప్రత్యేక ఎంట్రెన్స్​ టెస్టులో సాధించిన ర్యాంకు ఆధారంగా అడ్మిషన్  ఇస్తారు. ఇక ఈ కోర్సులకు ఫీజులు రెగ్యులర్​  కోర్సుల కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అధికారులు వెలడించారు. అడ్మిషన్​ పొందిన విద్యార్థులకు రోజూ సాయంత్రం పూట గానీ, వీకెండ్స్​లో గానీ క్లాసులు జరుగుతాయని తెలిపారు.