
- అవకాశం కల్పించనున్న ఉస్మానియా యూనివర్సిటీ
- ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం
- వర్కింగ్ ప్రొఫెషనల్స్కు 4 యూజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు
ఓయూ, వెలుగు : ఇంజినీరింగ్ లో డిప్లొమా ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందవచ్చు. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ పీజీ కోర్సులు, లా డిప్లొమా కోర్సుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్కు మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ.. ఈ ఏడాది నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, మెషీన్ లర్నింగ్, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సుల్లో అటు జాబ్ చేస్తూనే చదువుకునే అవకాశాన్ని కల్పించనుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి పొందిన వర్సిటీ.. ఈ విద్యా సంవత్సరం నుంచి కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఓయూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ హోల్డర్ల కోసం ఇంజినీరింగ్ కళాశాలలు బీఈ, బీటెక్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.
అయితే, ఇవి రెగ్యులర్ కోర్సులు. వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఈ కోర్సుల్లో చేరే అవకాశం లేదు. కానీ, డిప్లొమా పూర్తిచేసి బీఈ, బీటెక్కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సంబంధిత అర్హత పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా ట్యూషన్ ఫీజులు కట్టలేక ఇంజినీరింగ్ పూర్తిచేయలేకపోతున్నారు. ఉద్యోగం చేస్తూ డిగ్రీ సంపాదించడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నత విద్యను కొనసాగించడానికి ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కు దరఖాస్తు చేసింది. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏఐసీటీఈ ఈ కోర్సును నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి కోర్సులో 30 సీట్లు
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఓయూ నిర్వహిస్తున్న నాలుగు కోర్సుల్లో ప్రతి కోర్సులో 30 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. యూనివర్సిటీ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్ కోర్సుల్లో చేరేందుకు ఏదైనా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధిత సివిల్, మెకానికల్ డిప్లొమా చేసి ఉండాలి.
ఈ కోర్సుల్లో చేరాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తాముజాబ్ చేస్తున్న సంస్థ నుంచి నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్తీసుకొని వర్సిటీకి అందజేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నిర్వహించే ప్రత్యేక ఎంట్రెన్స్ టెస్టులో సాధించిన ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ఇక ఈ కోర్సులకు ఫీజులు రెగ్యులర్ కోర్సుల కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అధికారులు వెలడించారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు రోజూ సాయంత్రం పూట గానీ, వీకెండ్స్లో గానీ క్లాసులు జరుగుతాయని తెలిపారు.