తీన్మార్​ మల్లన్నకే మా మద్దతు.. సీపీఐ, సీపీఎం, టీజేఎస్​ నేతల ప్రకటన

తీన్మార్​ మల్లన్నకే మా మద్దతు..  సీపీఐ, సీపీఎం, టీజేఎస్​ నేతల ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: నల్గొండ – వరంగల్​– ఖమ్మం గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్​ మల్లన్న గెలుపు ఖాయమని సీపీఎం, సీపీఐ, తెలంగాణ జన సమితి (టీజేఎస్​) నేతలు అన్నారు. తమ మద్దతు తీన్మార్​ మల్లన్నకే అని స్పష్టం చేశారు. టీజేఎస్​ చీఫ్​ ప్రొఫెసర్​ కోదండరాం, ఆ పార్టీ నేత ప్రొఫెసర్​ విశ్వేశ్వరరావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, ఎస్​.వీరయ్య శనివారం సీఎం రేవంత్​తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇందులో కాంగ్రెస్​ నేతలు మహేశ్​కుమార్​  గౌడ్​, మల్లు రవి పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నిక చివరి రోజు ప్రచార సరళి, గెలుపోటముల అంచనాలపై వారు కొద్దిసేపు చర్చించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా తాము అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతు ఇచ్చామని, అదే తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్​కేనని స్పష్టంచేశారు.  ‘‘మార్పు కోసం కాంగ్రెస్​నే గెలిపించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక పాలనను బలోపేతం చేయాలంటే ఇది అవసరం. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్​ను గెలిపించుకోవాలి. అందుకే టీజేఎస్​ కార్యకర్తలు కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి” అని ఆయన అన్నారు.  కూనంనేని మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా తాము కాంగ్రెస్​కు పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.  

ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలన్నారు. సీపీఐ నాయకులంతా కాంగ్రెస్​  గెలుపు కోసం పనిచేయాలని ఆయన సూచించారు. తీన్మార్​ మల్లన్నకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలన్నారు. సీపీఎం నేతవీరయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తాము కాంగ్రెస్​కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. విద్యావంతులంతా కాంగ్రెస్​ పక్షాన నిలవాలన్నారు. కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ బైపోల్​పై  సీఎం సమీక్ష నిర్వహించారని, కాంగ్రెస్​ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారని అన్నారు.  సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి పార్టీలు కాంగ్రెస్​కు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు.  కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.