
- మిక్స్డ్లోనూ గెలిచి డబుల్ ధమాకా
అంటాల్యా: ఇండియా స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 11 ఏండ్ల పోరాటం, 20 టోర్నీల తర్వాత ఎట్టకేలకు ఆర్చరీ వరల్డ్కప్లో ఇండివిడ్యువల్ కేటగిరీలో గోల్డ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది మొదటిదైన వరల్డ్ కప్ స్టేజ్–1లో డబుల్ గోల్డ్ మెడల్తో మెరిసింది. శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్, ఇండివిడ్యువల్ కేటగిరీల్లో స్వర్ణాలు సాధించింది. ఒజాస్ డియోటలేతో కలిసి మిక్స్డ్లో బరిలోకి దిగిన జ్యోతి టైటిల్ ఫైట్లో 159–-154తో 12వ సీడ్ చైనీస్ తైపీ జంటను ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇండియన్ ద్వయం 16 బాణాలతో 15 సార్లు 10/10 పాయింట్లు సాధించారు. ఇందులో12సార్లు కరెక్ట్గా సెంటర్ పాయింట్ను టచ్ చేశారు. జ్యోతి ఆల్ పర్ఫెక్ట్ 10 సాధిస్తే, ఒజాస్ ఒకసారి 9 పాయింట్లు గెలవడంతో కొద్దిలో వరల్డ్ రికార్డు స్కోరు (160/160) మిస్ అయ్యింది. ఇక, ఇండివిడ్యువల్ కేటగిరీలో తనకు అందని ద్రాక్షగా ఉన్న గోల్డ్ను సురేఖ ఒడిసిపట్టుకుంది. ఫైనల్లో తెలుగమ్మాయి149–146తో మాజీ వరల్డ్ చాంపియన్ సారా లోపెజ్ (కొలంబియా)ను చిత్తు చేసింది. 2021 ఫైనల్లో లోపేజ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. మెన్స్ కాంపౌండ్లో ధీరజ్, అటాను దాస్, తరుణ్ దీప్లతో కూడిన ఇండియా టీమ్ ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో తలపడనుంది.