న్యూఢిల్లీ:దేశంతో పాటు ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఇప్పటిదాకా దానికి సరైన ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. దాని వల్ల వచ్చే లక్షణాలను కంట్రోల్ చేస్తూ వైరస్ను కట్టడి చేస్తున్నారు డాక్టర్లు. వివిధ మందుల కాంబినేషన్తో ఒంట్లోని వైరస్ లోడ్ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కొన్ని మందులూ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటు వ్యాక్సిన్లపైనా రీసెర్చ్లు, ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో ముందు వరుసలో ఉంది ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ చేడాక్స్1ఎన్కొవ్19. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు ఫైనల్ ట్రయల్స్ దశలోకి ఎంటరైపోయింది. ఫైనల్ ట్రయల్స్లోకి ఎంటరైన ఫస్ట్ వ్యాక్సిన్గా క్రెడిట్ కొట్టేసింది. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనికాతో పాటు మన దేశానికి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం చేసుకున్నాయి.
13 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఒక్కటే కాదు.. డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం మరో 13 వ్యాక్సిన్ క్యాండిడేట్లు ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇంకో 129 వ్యాక్సిన్ క్యాండిడేట్లు ప్రిక్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. మామూలుగా అయితే ఒక వ్యాక్సిన్ ప్రి క్లినికల్ ట్రయల్స్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు రావాలంటే సగటున 10.71 సంవత్సరాలు పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. అందులో సక్సెస్ అయ్యేది కూడా కేవలం 6 శాతమేనంటున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయానికి వస్తే మాత్రం దాదాపు అన్ని సంస్థలు దానిపై సీరియస్గా పనిచేస్తున్నాయి. దాంతోపాటు వీలైనంత తొందరగా జనానికి అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో వేగంగా ముందుకుపోతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్తో పాటు అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ కూడా ఇంకో వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. అది కూడా వచ్చే నెలలో ఫైనల్ ఫేజ్ ట్రయల్స్లోకి ఎంటరవుతుంది. ఇటు చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్దీ అదే రూటు. యూఏఈలో ఫేజ్ 3 ట్రయల్స్ చేసేందుకు చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ కంపెనీకి యూఏఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది.
నాలుగు క్యాండిడేట్లు.. ఐదు కంపెనీలు
మన దేశమూ వ్యాక్సిన్ తయారీకి తనవంతు సాయం చేస్తోంది. నాలుగు వ్యాక్సిన్ క్యాండిడేట్లపై మన దేశానికి చెందిన 5 కంపెనీలు పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ల ప్రభావం, టాక్సిసిటీ (విష ప్రభావం)ని తెలుసుకునేందుకు ప్రిక్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయి. ఇనాక్టివ్ హోల్ వైరస్ వ్యాక్సిన్ తయారీకి అమెరికాకు చెందిన రెఫానా ఐఎన్సీ అనే కంపెనీతో ఢిల్లీకి చెందిన పనాసీ బయోటెక్ జట్టు కట్టింది. రెండు వేర్వేరు ప్లాట్ఫాంలతో మూడు వ్యాక్సిన్ క్యాండిడేట్లపై హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ పనిచేస్తోంది. అందులో నాసల్ ఫ్లూ వ్యాక్సిన్ క్యాండిడేట్ కూడా ఒకటి. మన హైదరాబాద్కే చెందిన ఇండియా ఇమ్యునోలాజికల్స్ అనే కంపెనీ అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలతో ఒప్పందం చేసుకుంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్పై సీరమ్ ఇనిస్టిట్యూట్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అందుకు ఆస్ట్రాజెనికా, అమెరికాకుచెందిన కోడాజెనిక్స్, ఆస్ట్రియాకు చెందిన థెమిస్ బయోసైన్స్తో సీరమ్ జట్టు కట్టింది.
డేంజరూ ఉంది…
ఇంత వేగంగా వ్యాక్సిన్ను డెవలప్ చేయడమన్నది అసాధ్యమన్నది కొందరు నిపుణుల మాట. దాని వల్ల డేంజర్ పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరైన సేఫ్టీ చెక్స్ లేకుండా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొస్తే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని వాదిస్తున్నారు. ఉన్న వైరస్ పోవడం అటుంచి వ్యాక్సిన్ వల్లే ఒంట్లో వైరస్ తిష్ట వేసే ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు అలాంటి సంఘటనలూ జరిగాయంటున్నారు. ‘‘ఫిలిప్పీన్స్లో డెంగ్యూ వ్యాక్సిన్ డెంగ్వ్యాక్సియా ఎంతటి వివాదం రేపిందో మరిచిపోకూడదు. అక్కడి స్కూళ్లలో సనోఫీ పాశ్చర్ డెంగ్వ్యాక్సియాను పిల్లలకు ఇచ్చారు. అయితే, ఆ వ్యాక్సినేషన్ వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారు. దీంతో ఆ ప్రోగ్రామ్ను ఫిలిప్పీన్స్ రద్దు చేసింది. ఆ తర్వాతే వ్యాక్సిన్తో డెంగ్యూ వచ్చే ముప్పు కూడా ఉందని కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎవరూ మరువొద్దు’’ అని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్కే గంగూలీ అన్నారు.
10 వేల మందిపై ట్రయల్స్
ఫైనల్ స్టేజ్ ట్రయల్స్లో భాగంగా బ్రిటన్లో 10,260 మంది పెద్దలు, పిల్లలపై వ్యాక్సిన్ను పరీక్షించనుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ గ్రూప్. ఇటు సౌతాఫ్రికా, బ్రెజిల్లోనూ దానిపై ట్రయల్స్ జరగనున్నాయి. ఫలితాలు సక్సెస్ అయితే ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. ‘‘క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. పెద్దల్లో ఆ వ్యాక్సిన్ ఎలాంటి ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుందో తెలుసుకునేందుకు ఫైనల్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తున్నాం. పెద్ద సంఖ్యలో జనానికి అది రక్షణ కల్పిస్తుందా లేదా అన్నది తేలుస్తాం’’ అని ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ హెడ్ ప్రొఫెసర్ పొలార్డ్ చెప్పారు.