బాచుపల్లిలో రోడ్డెక్కిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బాధితులు

బాచుపల్లిలో రోడ్డెక్కిన మరో  రియల్ ఎస్టేట్ కంపెనీ బాధితులు

హైదరాబాద్ లో  రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు కొనసాగుతున్నాయి.  ఆఫర్ల పేరుతో  రియల్టర్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. నిర్మాణాలు మొదలు పెట్టి ఏళ్లు  గడుస్తున్నా  కొనుగోలుదారులకు ఫ్లాట్స్ ఇవ్వకుండా సతాయిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇదే తరహాలో బాచుపల్లిలో ఓ నిర్మాణ సంస్థ తొమ్మిదేళ్లు గడిచినా కొనుగోలుదారులకు ఫ్లాట్స్ ను  అందజేయకుండా తిరిగి అదనపు సొమ్ము  డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తూ  ప్లాట్స్ కొనుగోలు దారులు ఆందోళనకు దిగారు.

బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన   నెబ్యుల పసిఫిక రియల్ ఎస్టేట్ కంపెనీ 2016లో హైదరాబాద్ బాచుపల్లి లో రెరా అనుమతితో 2670 ఫ్లాట్స్ తో భారీ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే  అప్పటి నుంచి కొనుగోలుదారుల దగ్గర నుంచి  విడతలవారీగా డబ్బులు తీసుకున్న .. కంపెనీ గడువులోగా వారికి ఇళ్ళు అందజేయడంలో విఫలమైంది.  కరోనా పేరుతో కొంతకాలం గడువును పొడిగించగా నిర్మాణంలో ఆలస్యం కారణంగా మరింత కాలం గడిచిపోయింది.  

►ALSO READ | దేశ్ కీ నేత ప్రకటనలకు రూ.266 కోట్లు.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారినప్పుడు రూ. 244.17 కోట్ల ప్రకటనలు

రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ఫ్లాట్స్ అప్పగించలేదు.  డబ్బులు చెల్లించిన వారికి కనీసం అగ్రిమెంటు పేపర్స్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది.  తొమ్మిదేళ్లు  అయినా తమకు ఇల్లు ఇవ్వటం లేదని కొనుగోలుదారులు జులై 12న  నిర్మాణం దగ్గర ఆందోళనకు దిగారు.  ఇంకా 30 శాతం వర్క్ పెండింగ్ ఉందని అసలు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు ఆ నిర్మాణ సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.