అరేబియా సముద్రంలో పాకిస్తాన్‌‌ పోర్ట్!

అరేబియా సముద్రంలో  పాకిస్తాన్‌‌ పోర్ట్!
  •    నిర్మాణం కోసం అమెరికాతో సంప్రదింపులు
  •     పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణా కోసం ప్లాన్

న్యూయార్క్:  అరేబియా సముద్రంలో పోర్ట్‌‌‌‌ను నిర్మించేందుకు పాకిస్తాన్​ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు అమెరికాను ఆ దేశం సంప్రదించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. గత నెలలో అమెరికాలో పర్యటించినప్పుడు పాక్​ ప్రధాని షెహబాజ్‌‌‌‌ షరీఫ్‌‌‌‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌‌‌‌ ఆసీం మునీర్​ ఈ ప్రతిపాదనలు చేశారు. పాకిస్తాన్‌‌‌‌లోని పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణాకు దీన్ని ఉపయోగించుకోవాలని పాకిస్తాన్​ ఆలోచిస్తున్నది.  

పాస్నీ  ఓ ఓడరేవు పట్టణం. ఇది అఫ్గానిస్తాన్‌‌‌‌-– ఇరాన్‌‌‌‌ సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో ఉన్నది. కాగా, వైట్‌‌‌‌హౌస్​లో ట్రంప్‌‌‌‌తో భేటీకి ముందే మునీర్‌‌‌‌‌‌‌‌ అడ్వైజర్లు.. ఈ పోర్ట్​ అంశాన్ని యూఎస్​ అధికారులో చర్చించినట్టు సమాచారం.  అమెరికా సైనిక స్థావరాల కోసం మాత్రం ఈ ఓడరేవును ఉపయోగించుకోవద్దని అమెరికాను పాక్ కోరినట్టు తెలిసింది. దీనికి బదులుగా వెస్ట్​ పాకిస్తాన్‌‌‌‌లోని ఖనిజాలు లభించే ప్రావిన్స్‌‌‌‌లకు టెర్మినల్‌‌‌‌ను అనుసంధానించే రైలు కారిడార్‌‌‌‌ అభివృద్ధికి నిధులు కోరినట్లు సమాచారం. ఈ టెర్మినల్‌‌‌‌ ప్రాజెక్టు గురించి అటు అమెరికా అధికారులు కానీ.. ఇటు పాక్‌‌‌‌ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. దీనిపై 
పాక్​ ఆర్మీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.