
కరాచి: కాల్పులు ఆపాలని తామే భారత్ను కోరామని పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇసాక్దార్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్లోని రెండు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించామని చెప్పారు. అయితే, రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పుకోవడం, దానిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించడం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై ఇసాక్దార్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు విషయం బయటపెట్టారు.
మేమే అభ్యర్థించాల్సిన పరిస్థితి..
పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని ఇసాక్దార్ చెప్పారు. ‘‘పాక్కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్.. ఆర్మీ ప్రధాన కార్యాలయంతో పాటు వీఐపీ రవాణా యూనిట్లను కలిగి ఉంది. షోర్కోట్ వైమానిక స్థావరంలో జేఎఫ్-17, మిరాజ్ యుద్ధ విమానాలు, అలౌట్ III హెలికాప్టర్లు ఉన్నాయి.
తాము ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఇండియాపై దాడి చేయాలనుకున్నాం. కానీ, అంతకుముందే 2.30 గంటలకు భారత్ దాడి చేసి నూర్ఖాన్, షోర్కోట్ బేస్లను ధ్వంసం చేసింది”అని పేర్కొన్నారు. దీంతో తమ దేశానికి భారీ నష్టం జరగొచ్చని భావించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరామన్నారు. నూర్ఖాన్పై దాడి జరిగిన 45 నిమిషాలకు సౌదీ యువరాజు పైసల్ తనకు ఫోన్ చేశారని ఇసాక్దార్ చెప్పారు.
‘‘కాల్పుల విరమణ గురించి భారత్తో మాట్లాడాల్నా అని ఆయన నన్ను అడిగారు. అవును సోదరా.. మేం కాల్పులు విరమించుకుంటాం సాయం చేయండి అని కోరాను. కాసేపటికి సౌదీ యువరాజు నాకు మళ్లీ కాల్ చేశారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మాట్లాడానని, కాల్పుల విరమణకు భారత్ కూడా అనుకూలంగా ఉందని చెప్పారు. దీంతో తామే భారత్ను సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించాం. ఆ తర్వాత పరిస్థితులు సర్దుమణిగాయి” అని ఇసాక్దార్ చెప్పారు.