ఇస్లామాబాద్: వరదలతో నష్టపోయిన తమ దేశానికి రూ.1200 కోట్ల సాయం చేయాలని యునైటెడ్ నేషన్స్(యూఎన్) తో కలిసి అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. తమ దేశంలో వరదలకు 1100 మంది చనిపోయారని, 3.3 కోట్ల మంది ప్రభావితమయ్యారని, పంటలు దెబ్బతిన్నాయని పాక్ తెలిపింది. వరదల్లో పాకిస్తాన్ కొట్టుకుపోయిందని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఓ వీడియోలో అన్నారు. ‘‘పాక్ ప్రజలు భయంకరమైన వరదల బారినపడ్డారు.
అంతర్జాతీయ సమాజం ఆర్థిక సాయం చేస్తే కనీసం 50 లక్షల మందికి ఆహారం, నీరు, వైద్యం, పారిశుధ్య సౌకర్యాలు కల్పించవచ్చు” అని గుటెర్రెస్ పేర్కొన్నారు. వరదల తర్వాత ‘2022 పాకిస్తాన్ ఫ్లడ్స్ రెస్పాన్స్ ప్లాన్’ (ఎఫ్ఆర్పీ) ని పాక్ ప్రభుత్వం, యూఎన్ కలిసి ప్రారంభించాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తమ దేశ ఉనికి ప్రమాదంలో పడిందని, సాయంచేయాలని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కోరారు.
3.3 కోట్ల మందిపై ప్రభావం
వరదల వల్ల 3.3 కోట్ల మంది, 72 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, చిన్న దేశంతో ఇది సమానమని బిలావల్ భుట్టో తెలిపారు. వరదల కారణంగా వేలమంది నిరాశ్రయులయ్యారని, బాధితులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆరుబయట గడిపారని ఆయన చెప్పారు. ‘‘బాధితుల కోసం ఇప్పటికే రూ.1300 కోట్లు కేటాయించాం. రిలీఫ్ యాక్టివిటీస్ కోసం రూ.500 కోట్లను నేషనల్
డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి కేటాయించినం. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చెరో పది లక్షలు, గాయపడిన వారికి, ఇండ్లు దెబ్బతిన్న వారికి తలా రెండున్నర లక్షలు ఇస్తున్నం. ఇండ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలిస్తున్నం” అని బిలావల్ వివరించారు. కాగా, పాక్కు వరద సాయం కింద రూ.39 కోట్లు ఇస్తామని కెనడా ప్రకటించింది. సాయం చేస్తామని చైనా పేర్కొంది.
నేషనల్ డిజస్టర్ ఏజెన్సీ ఏర్పాటు
భీకర వరదల వల్ల సంభవించిన నష్టాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఈ ఏజెన్సీ ద్వారా వరద బాధితులకు ఆర్థిక సాయం చేయనుంది.