నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్​లో గుర్తింపు

నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్​లో గుర్తింపు

ప్రకటించిన ఏఐసీసీ.. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్​లో గుర్తింపు: స్రవంతి

హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ ముకుల్​వాస్నిక్​ శుక్రవారం ప్రకటన రిలీజ్ ​చేశారు. మాజీ ఎంపీ, సీనియర్​ నేత దివంగత పాల్వాయి గోవర్ధన్​రెడ్డి కూతురైన స్రవంతి.. మునుగోడు రేసులో ముందు నుంచీ ఉన్నారు. మరో ముగ్గురు అభ్యర్థులతో పోటీ పడి ఆమె టికెట్ దక్కించుకున్నారు. 2014లో మునుగోడు నుంచి ఇండిపెండెంట్​గా పోటీ చేసిన ఆమె రెండో స్థానంలో నిలిచారు. వృత్తిరీత్యా లాయర్​ అయిన స్రవంతి హైకోర్టులో ప్రాక్టీస్​ చేశారు. 2001లో పీసీసీ సభ్యురాలిగా, 2005లో ఏఐసీసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజమైన కార్యకర్తలకు కాంగ్రెస్​లో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. మునుగోడు అభ్యర్థిగా ఎంపికైన స్రవంతికి పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అభినందనలు తెలిపారు. ఇక, అభ్యర్థి ప్రకటన పూర్తి కావడంతో ప్రచారంపై పీసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యనేతలు శనివారం గాంధీభవన్​లో భేటీ కానున్నారు.

2014 ఎన్నికల్లో స్రవంతి మునుగోడు టికెట్​ ఆశించారు. ఆ ఎన్నికల్లో  సీపీఐతో పొత్తు ఉండడంతో కాంగ్రెస్ నుంచి టికెట్​ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్​గా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 27,441 ఓట్లు పడ్డాయి. సీపీఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డి ఓడిపోయారు. స్రవంతి రెబల్​గా పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికల్లో మరోసారి టికెట్​ కోసం స్రవంతి ప్రయత్నించారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో స్రవంతికి మరోసారి అవకాశం చేజారింది. అయితే ఈ సారి కూడా మునుగోడు టికెట్​ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నా కైలాష్ పోటీ పడ్డారు. అధిష్టానం స్రవంతి వైపే మొగ్గు చూపింది. 

ఐదు సార్లు గెలిచిన గోవర్ధన్​రెడ్డి..
1967 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో మునుగోడులో ఆరు సార్లు కాంగ్రెస్​ గెలిచింది. 1967 నుంచి 1983 వరకు వరుసగా 4 సార్లు గోవర్ధన్​రెడ్డి గెలిచారు. తిరిగి 1999లో మరోసారి విజయం సాధించారు. 1989, 1994, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. 2009 ఎన్నికల్లో గోవర్ధన్​రెడ్డి ఓడిపోయాక కాంగ్రెస్​ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది.