V6 News

అక్టోబర్ నెలఖారులోగా ఎలివేటెడ్ కారిడార్-1 పనులు..హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపులకు సన్నాహాలు

అక్టోబర్  నెలఖారులోగా ఎలివేటెడ్ కారిడార్-1 పనులు..హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపులకు సన్నాహాలు
  • ప్యారడైజ్ టు బోయిన్​పల్లి వరకూ 5.4 కి.మీ కారిడార్ 
  •  ప్రాజెక్టు పనులతో ట్రాఫిక్ మళ్లింపులపై హెచ్ఎండీఏ, ట్రాఫిక్ పోలీసుల చర్చలు
  • బోయిన్​పల్లి వెళ్లే వాహనాలు తాడ్​బండ్​ టు అన్నానగర్ మీదుగా మళ్లింపు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సికింద్రాబాద్ ప్యారడైజ్​జంక్షన్​నుంచి బోయినపల్లి డెయిరీ ఫారం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్​కారిడార్​–1 ప్రాజెక్టు పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్​మళ్లింపులకు హెచ్ఎండీఏ, ట్రాఫిక్​ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాయిల్​టెస్టింగ్ దాదాపు పూర్తయిందని అధికారులు తెలిపారు. 

ప్యారడైజ్ నుంచి బోయినపల్లి డెయిరీ ఫారం వరకు 5.4 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ పనులు చేపట్టాలంటే ఈ ప్యారడైజ్​జంక్షన్​నుంచి బోయిన్​పల్లి వరకూ ట్రాఫిక్​ సమస్యలు లేకుండా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ను మళ్లించాలి. 

ఈ మేరకు హెచ్ఎండీఏ అధికారులు, ట్రాఫిక్​ పోలీసులు కలిసి ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్​మళ్లింపులు చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. ట్రాఫిక్​డీసీపీ, ఏసీపీ వంటి ఉన్నతాధికారులు హెచ్ఎండీఏ అధికారులతో కలిసి ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నారు. 

అన్నా నగర్​లో కొత్తగా రోడ్ల నిర్మాణం, రిపేర్లు

ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా బాలంరాయి నుంచి తాడ్​బండ్​వరకూ, అక్కడి నుంచి బోయిన్​పల్లికి వెళ్లే దారుల్లో కొన్ని చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు విధించనున్నారు. ముఖ్యంగా తాడ్​బండ్​ నుంచి బోయిన్​పల్లికి వెళ్లే వాహనాలను అన్నా నగర్​ మీదుగా బోయిన్​పల్లికి మళ్లించాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి.

 ఈ మేరకు ఇప్పటికే అన్నా నగర్​లో రోడ్లను మరమ్మతు, కొత్త రోడ్ల నిర్మాణం, కొన్ని చోట్ల రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు, హెచ్​ఎండీఏ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్టు తెలిపారు.

రూ.1,550 కోట్లతో ప్రాజెక్టు

ప్యారడైజ్​– బోయిన్​పల్లి డెయిరీ ఫారం కారిడార్​కు సంబంధించి భూ సేకరణ పనులు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. రక్షణ శాఖ అధికారులతో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు పనుల ప్రారంభానికి లైన్​క్లియర్​అయ్యింది. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా అధికారులు పూర్తిచేశారు.

 ప్రస్తుతం సాయిల్​టెస్ట్​ పనులు కూడా పూర్తి కావచ్చినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 5.4 కి.మీ. ఈ కారిడార్​ను పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బేగంపేట ఎయిర్​ వద్ద తాడ్​బండ్​ వైపున 600 మీటర్ల మేర అండర్​గ్రౌండ్​ టన్నెల్​ నిర్మించనున్నారు. మొత్తం 652 కోట్ల ఈ ప్రాజెక్టును  భూసేకరణతో కలిపి రూ.1,550 కోట్లతో నిర్మించనున్నారు.

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్​ కారిడార్​ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్​ సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వస్తే ఆయా ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద సిగ్నల్స్​ను తొలగించే అవకాశం ఉంటుంది. ఎన్​హెచ్​–44 రోడ్​లో మేడ్చల్​, మెదక్​, కామారెడ్డి, నిజామాబాద్​, నిర్మల్​, ఆదిలాబాద్​ రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్​ ఇబ్బందులు ఉండదని తెలిపారు.