హైదరాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో గుండె జబ్బులకు టెస్టులు, చికిత్సలు చేసే అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ అందుబాటులో ఉన్నా.. సర్కార్ నిర్లక్ష్యం వల్ల అది నిరుపయోగంగా మారింది. సుమారు రూ. 10 కోట్ల విలువైన మెషీన్ మెయింటెనెన్స్ లేకపోవడంతో పాడవుతోందని, వైర్లను ఎలుకలు కొరుకుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఒక్క కార్డియాలజిస్టును కూడా లేకపోవడంతో క్యాథ్ ల్యాబ్ నిరుపయోగంగా ఉందంటున్నారు. కార్డియాలజిస్టులకు హైదరాబాద్లోని ప్రైవేటు హాస్పిటల్స్లో తక్కువలో తక్కువ రూ.1.5 లక్షల వరకూ జీతం ఇస్తున్నారు. సీనియారిటీని బట్టి ఇంతకంటే ఎక్కువ కూడా ఇస్తున్నారు. కానీ రిమ్స్(రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో పనిచేస్తే రూ.లక్షన్నర వరకూ మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం అంటోంది. దీంతో అక్కడ పనిచేయడానికి కార్డియాలజిస్టులు ఇంట్రస్ట్ చూపడం లేదు. అదే జీతానికి ఆదిలాబాద్కు పోయేదానికంటే, హైదరాబాద్లోనే ఈజీగా సంపాందించుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల జీతం ఇస్తేనే.. ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లేందుకు కార్డియాలజిస్టులు ముందుకొచ్చే అవకాశం ఉందని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.
ప్రైవేటుకు రిఫర్ చేస్తున్నరు
డాక్టర్లు లేని కారణంగా గుండె జబ్బులతో రిమ్స్కు వచ్చే పేషెంట్లను ప్రైవేటు హాస్పిటల్స్కు రిఫర్ చేస్తున్నారు. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ తదితర గుండె సంబంధిత టెస్టులు, సర్జరీలు చేయడానికి ప్రైవేటు హాస్పిటళ్లు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన ప్యాకేజీలన్నీ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. అయినా ప్రైవేటు హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అందించి డబ్బులు పొందడంతో పాటు, అదనంగా పేషెంట్ల నుంచి కూడా వసూలు చేస్తున్నాయి. డాక్టర్లను నియమిస్తే రిమ్స్లోనే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అందించొచ్చు. దీనివల్ల రిమ్స్కు కూడా ఆరోగ్యశ్రీ కింద నిధులు వస్తాయి. ఇవే డబ్బులను డాక్టర్ల జీతాలు చెల్లించేందుకు వాడుకోవచ్చని, పేషెంట్లపై ఆర్థిక భారం తగ్గించొచ్చని చెప్తున్నారు. ఇలా ఈజీగా పరిష్కరించే మార్గం ఉన్నా.. సర్కార్ మాత్రం ఈ దిశగా ఆలోచించడం లేదని పేర్కొంటున్నారు.
