
తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని సహించేది లేదని స్పష్టం చేశారు. తాండూరులో స్థానిక బీఆర్ఎస్ నేతలతో పట్నం సమావేశమయ్యారు. తన వాళ్లను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు మంత్రి.
తాండూరులో పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం పార్టీ సీనియర్ నాయకులంతా శ్రమిస్తున్నారని చెప్పారు. అలాగే కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి భారీ మోజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. కొడంగల్, తాండూరు, వికారాబాద్ లలో కొంతమంది నాయకులు పార్టీని వీడినప్పటికీ ఎలాంటి నష్టం లేదన్నారు. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగిలలో బీఆర్ఎస్ విజయం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ : సంక్షేమ పథకాల పేరుతో దొచుకున్నరు.. బీఆర్ఎస్ హామీలు పేపర్లకు పరిమితం
ఉమ్మడి రంగారెడ్ది జిల్లాకు చెందిన పట్నం మహేందర్ రెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉంది. ఈ సారి బీఆర్ఎస్ సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో పట్నం పార్టీ మారుతారంటూ ప్రచారం మొదలైంది . ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించిన సీఎం మంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా మళ్లీ అధికారం లోకి వస్తే ఎమ్మెల్సీతో పాటుగా మంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం.