
నియోజకవర్గాల్లో ప్రారంభించనున్న ప్రజాప్రతినిధులు
చేపట్టిన పనులు ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్
రాష్ట్రంలో నిరక్షరాస్యుల గుర్తింపునకు సర్వే: సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 128 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లలో ‘పట్టణ ప్రగతి’ సోమవారం నుంచి మొదలుకానుంది. తమ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. 10 రోజులపాటు జరిగే ఈ ప్రోగ్రాంలో పట్టణాలు, నగరాల రూపురేఖలు మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు మీటింగ్లు పెట్టిన సీఎం.. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి నిర్వహణ కోసం 14వ ఆర్థిక సంఘం నిధులను రిలీజ్ చేశారు. వాటితో చేపట్టాల్సిన పనులకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులన్నింటికీ తదుపరి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం తెలపాలని సీడీఎంఏ సత్యనారాయణ సర్క్యులర్ లో
కమిషనర్లకు సూచించారు. గుర్తించిన పనులను ఆరు నెలల్లోగా కంప్లీట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణాలు, నగరాలతో పాటు గ్రేటర్ సిటీతోపాటు కంటోన్మెంట్ బోర్డులో కూడా నిరక్షరాస్యుల గుర్తింపునకు సర్వే నిర్వహించనున్నామని సీఎస్ సోమేశ్కుమార్ ప్రకటించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే సక్సెస్ అవుతది… పట్టణ ప్రగతిపై మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో చెప్పారు. పట్టణ ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకున్నామని, మార్చి 4 వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అన్ని మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే గైడ్లైన్స్ జారీ చేశామన్నారు. వార్డు యూనిట్గా పట్టణ ప్రగతి నిర్వహించాలని, ఇందుకోసం నియమించిన స్పెషల్ ఆఫీసర్ రోజూవారి చేపట్టే కార్యక్రమాలపై తమ టీంను అలర్ట్ చేయాలన్నారు. శానిటేషన్, తాగునీటి సరఫరా, రోడ్లు, గ్రీనరీ, నర్సరీల ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్స్ కు అనువైన స్థలాల గుర్తింపు తదితర పనులను ప్లాన్ ప్రకారం నిర్వహించాలన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు ఇయర్ క్యాలెండర్ను రూపొందించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, కూల్చేసిన భవనాల వ్యర్థాలు చెరువుల్లో వేయకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వార్డు కమిటీల మీటింగ్లు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాలని, ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, కార్పొరేటర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వార్డులను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అధికారులంతా కలిసి పనిచేయాలన్నారు.
పాలమూరులో కేటీఆర్ టూర్..
మంత్రి కేటీఆర్ సోమవారం మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు మెట్టుగడ్డలోని డైట్ కాలేజీ గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:45 నిమిషాలకు రైల్వే స్టేషన్ రోడ్డులో సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ ని ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు టౌన్లోని బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి ఉదయం 11:15 గంటలకు పాత తోటలో స్లమ్ ఏరియాలో పాదయాత్ర చేపడతారు. ఉదయం 11: 45 గంటలకు మున్సిపల్ ఆఫీస్ లో చెత్త సేకరణ ఆటోలను ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు వైట్ హౌస్ ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ కౌన్సిలర్, కమిటీ మెంబర్లు, అధికారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనతో పాల్గొంటారు.