
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం 'ఓజీ' (They Call Him OG) సెప్టెంబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తన సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. అభిమానులు ఆయన తదుపరి యాక్షన్ ప్యాక్డ్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్ పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఓజీ’ ఇంపాక్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ!
అయితే ప్రస్తుతం పవర్ స్టార్, లోకేష్ కనగరాజ్ ల భాగస్వామ్యంపై చర్చలు చివరి దశలో ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. ఈ వార్త మాత్రం అభిమానుల్లో ఉర్రూతలూగిస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ ఎలివేషన్స్కి, లోకేష్ కనగరాజ్ గ్రిట్ అండ్ డార్క్ స్టోరీటెల్లింగ్ తోడైతే, అది బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ కాంబినేషన్ సెట్ అయితే 'ఓజీ' హిట్కు 100 రెట్లు ఇంపాక్ట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ను కన్నడనాట ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇప్పటికే పవన్ కళ్యాణ్ డేట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ దళపతి విజయ్తో జన నాయకన్, యష్తో టాక్సిక్, చిరంజీవితో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా వంటి భారీ ప్రాజెక్ట్లను నిర్మిస్తోంది. అటు లోకేష్ కనగరాజ్ లేదా హెచ్. వినోద్ ఈ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది.
LCU ఎంట్రీ ఉంటుందా? ఫ్యాన్స్ కోరిక ఇదే!
ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగమవుతుందా అనే చర్చ కూడా మొదలైంది. కమల్ హాసన్, విజయ్, కార్తీ వంటి ఐకానిక్ పాత్రలను కలిగి ఉన్న LCUలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెడితే, అది సౌత్ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి అవుతుంది. అభిమానులు కూడా లోకేష్, పవన్ కళ్యాణ్,సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కాంబినేషనే కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై తన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబోకు మరింత బలం చేకూరింది. అయితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా విడుదలయ్యాకే, లోకేష్ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం రాజకీయ జీవితంతో బిజీగా ఉంటూనే, పవన్ కళ్యాణ్ ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ విషయానికొస్తే.. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్బస్టర్ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుడుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. పదునైన కథా కథనాలు, లేయర్డ్ పాత్రలు, అదిరిపోయే సినిమాటిక్ ఫ్లేర్తో ఆధునిక యాక్షన్ సినిమాలను ఆయన కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది...