త్వరలో ఫుల్ ఫ్లెడ్జ్గా లాంచ్
2018 నుంచి టెస్టింగ్ దశలో సర్వీసులు
40 కోట్ల మంది యూజర్లకు అందుబాటు
న్యూఢిల్లీ: గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే, అమెజాన్ పేలకు పోటీగా వాట్సాప్ పే వచ్చేస్తోంది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)పై ఫుల్ ఫ్లెడ్జ్గా పేమెంట్స్ సర్వీసులను లాంచ్ చేసేందుకు వాట్సాప్ సిద్ధమైంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) నుంచి వాట్సాప్కు లైసెన్స్ వచ్చినట్టు తెలిసింది. ఈ లైసెన్స్తో దేశవ్యాప్తంగా దశల వారీగా ఈ సర్వీసులను వాట్సాప్ లాంచ్ చేయబోతోంది. ఫేస్బుక్కు చెందిన ఈ కంపెనీ, ఇండియాలో 2018 నుంచి వాట్సాప్ పే సర్వీసులను టెస్టింగ్ దశలో ఉంచింది. 10 లక్షల మంది యూజర్లకు టెస్టింగ్ సర్వీసులను అందిస్తోంది. రెగ్యులేటరీ అనుమతి రాకపోవడంతో, ఇన్ని రోజులు వాట్సాప్ ఈ సర్వీసులను ఫుల్ ఫ్లెడ్జ్గా లాంచ్ చేయలేదు. వాట్సాప్ పే లాంచింగ్ తొలి దశలో భాగంగా ఇండియాలో కోటి మందికి ఈ సర్వీసులను అందించనుందని ఓ ఇంగ్లీస్ వెబ్సైట్ రిపోర్ట్ చేసింది. మొత్తంగా 40 కోట్ల మంది యూజర్లకు వాట్సాప్ పేమెంట్ సర్వీసులను విస్తరించనుందని తెలిపింది.
డేటా లోకలైజేషన్ రూల్స్ చేరుకుంది…
2018 ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా లోకలైజేషన్ రూల్స్ను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రకారం పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు పేమెంట్స్ సమాచారాన్ని ఇండియన్ సర్వర్లలోనే స్టోర్ చేయాలి. ఇది ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రొవైడర్లకు అతిపెద్ద టాస్క్గా మారింది. వాట్సాప్ ప్రస్తుతం చాలా వరకు డేటా లోకలైజేషన్ కండిషన్లను నెరవేరుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఎన్పీసీఐ నుంచి అనుమతి వచ్చి, పేమెంట్ సర్వీసెస్ విస్తరణకు అవకాశం దక్కిందని తెలిపాయి.
2016లో వచ్చిన యూపీఐ….
యూపీఐను ఎన్పీసీఐ 2016 ఆగస్ట్లో లాంచ్ చేసింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేసిన తర్వాత, యూపీఐ పేమెంట్లలో బాగా పాపులారిటీ సంపాదించింది. జనవరి 2020 చివరి నాటికి యూపీఐ లావాదేవీలు 130.5 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.2.16 లక్షల కోట్లుగా ఉంది. పేమెంట్ అప్లికేషన్లు యూపీఐ ద్వారా సర్వీసులను అందించడం బాగా పెరుగుతోంది. కస్టమర్లు యూపీఐ ద్వారా ప్రస్తుతం రూ.2 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐపీఓ సబ్స్క్రిప్షన్, రికరింగ్ పేమెంట్స్ వంటి ఫీచర్లను కూడా యూపీఐ ప్లాట్ఫామ్పై యాడ్ చేశారు.