న్యూఢిల్లీ: పేటీఎం తన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ (టికెట్స్ అమ్మే) బిజినెస్ను జొమాటోకు అమ్మేందుకు చర్చలు జరుపుతోంది. సేల్స్ పడిపోవడంతో ఈ ఫిన్టెక్ కంపెనీ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. డీల్ విలువ రూ. రెండు వేల కోట్లు ఉంటుందని , ఇరు కంపెనీల మధ్య చర్చలు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. ఇతర కంపెనీలు కూడా పేటీఎం మూవీస్, ఈవెంట్స్ టికెటింగ్ బిజినెస్పై ఆసక్తి చూపిస్తున్నాయని వెల్లడించారు.
ఈ అంశంపై పేటీఎం, జొమాటో స్పందించలేదు. పేటీఎం తన నాన్ కోర్ (కీలకం కాని) బిజినెస్లను అమ్మాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఉద్యోగుల కోత ఉండొచ్చని ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను ఆర్బీఐ బ్యాన్ చేసిన తర్వాత నుంచి పేటీఎంలో మార్పులు మొదలయ్యాయి. పేటీఎం మూవీస్, ఈవెంట్స్ టికెటింగ్ బిజినెస్ కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,740 కోట్ల విలువైన అమ్మకాలు జరిపింది.