హైదరాబాద్, వెలుగు: తన కుటుంబం మీద వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ పంటల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారని, ఆయన మాటలను జనం నమ్మరని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ తెలిపారు. ఆదివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సూర్యపేటలో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేశారని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ అవినీతి పరిపాలన అంతా ప్రజల కళ్ల ముందు ఉన్నదని పేర్కొన్నారు.
తెలంగాణ ఖజానాను కేసీఆర్ ఖాళీ చేసి వెళ్ళినందుకే రైతు రుణ మాఫీలో జాప్యం జరుగుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే వనరులను సమకూర్చుకుని తమను ఆదుకుంటుందనే భరోసాలో రైతులు ఉన్నారని జి.నిరంజన్ వివరించారు. గోరంతను కొండంతగా చూపే ప్రయత్నం చేస్తే ప్రజలే కేసీఆర్కు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.