
- నేడు ఎంపీగా ప్రమాణం చేయనున్న యువనేత
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎంపీగా తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం ప్రారంభమైన 18వ లోక్సభ సమావేశాలకు వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి నుంచి తమ తాత, దివంగత నేత కాకా వెంకటస్వామి ఎంపీగా గెలిచారని గుర్తు చేశారు. అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. తర్వాత పెద్దపల్లి నుంచి ఎంపీగా తన తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహించారని చెప్పారు. తాత, తండ్రి అడుగు జాడల్లోనే తాను కూడా ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టానన్నారు. వారి లాగానే రాష్ట్ర ఎంపీగా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేస్తానని తెలిపారు. గడిచిన పదేండ్లు పెద్దపల్లి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాలైన తాగునీరు, మెరుగైన రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించలేదని చెప్పారు. అలాగే ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. అయితే పెద్దపల్లి ప్రజలకు మేలు చేసేందుకు ఈ సారి తనకు అవకాశం దక్కిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, అభివృద్ధి పనులతో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని,
ఆ దిశలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
మధ్యాహ్నం 2 గంటలకు..
పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ మంగళవారం ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన సభ్యులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రెండో రోజు ఎంపీగా ప్రమాణ చేసే అవకాశం దక్కింది. మంగళవారం మధ్యాహ్నం 2- నుంచి 3 గంటల మధ్య వీరు ఎంపీలుగా ప్రమాణం చేయనున్నారు. ఇందులో తొలుత ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, తర్వాత పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణం చేయనున్నారు. వీరి తర్వాత వరుసగా ధర్మపురి అర్వింద్, సురేశ్ పెట్కార్, ఎం.రఘునందన్ రావు, ఈటల రాజేందర్, అసదుద్దీన్ ఒవైసీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి ప్రమాణం చేయనున్నారు.