పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఆర్డీఓ, రామగుండం కార్పొరేషన్ఇన్ చార్జ్ కమిషనర్ శంకర్ కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం కార్పొరేషన్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న రజినీకాంత్కు పట్టణ ప్రగతి, శానిటేషన్ లిక్విడ్ కు సంబంధించిన రూ.9.25లక్షల బిల్లు రావాల్సి ఉంది. చెక్కు రిలీజ్చేయాలంటే రూ.లక్ష లంచంగా ఇవ్వాలని ఆర్డీఓ శంకర్ కుమార్ డిమాండ్ చేశాడు. ఇస్తానని ఒప్పుకున్న రజినీకాంత్ ఏసీబీని ఆశ్రయించాడు. ముందుగా సూచించిన ప్రకారం ఆర్డీఓ బంధువు అయిన మల్లికార్జున్ అనే వ్యక్తికి కాంట్రాక్టర్మంగళవారం రూ.లక్ష ఇచ్చాడు. మల్లికార్జున్ ఆ డబ్బును ఆర్డీఓ శంకర్కుమార్కు అతని ఆఫీస్లో ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శంకర్కుమార్, మల్లికార్జున్ పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. రెండు నెలల కింద పెద్దపల్లి సీపీఓ కూడా ఇలాగే కాంట్రాక్ట్పనుల బిల్లు జారీ విషయంలో లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కాడు. ఆ ఘటన మర్చిపోకముందే జిల్లాకు చెందిన మరో ఉన్నతాధికారి దొరకడం చర్చనీయాంశమైంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో మరొకరు
ఉప్పునుంతల(వంగూర్): నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఏస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సంకెళ్ల రాము తన తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీదికి మార్చాలని పంచాయతీ కార్యదర్శి చింతకుంట్ల రామస్వామికి అప్లికేషన్పెట్టుకున్నాడు. అందుకు రామస్వామి 6 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇస్తానని ఒప్పుకున్న రాము తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రాము నుంచి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు.