పెద్దపల్లి, వెలుగు : రహదారుల విస్తరణ వల్లే పరిశ్రమల స్థాపనతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ. 900 కోట్ల విలువైన రహదారి పనులు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలోనే రూ. 1700 కోట్ల విలువైన పనులను మంజూరు చేసిందన్నారు.
హ్యామ్ విధానంలో 40 శాతం ఖర్చును ప్రభుత్వ భరిస్తే.. మిగతా 60 శాతం కాంట్రాక్టర్ భాగస్వామ్యం ఉంటుందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు, ఎమ్మెల్యే మక్కాన్సింగ్తో కలిసి బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, మంథనిలో బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలో రూ. 250 కోట్లతో చేపట్టనున్న, మంథని నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తోందన్నారు.
ప్రస్తుతం శంకుస్థాపన చేసిన పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు.
ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పథకాలు కొనసాగిస్తున్నం
బీఆర్ఎస్ పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ సంక్షేమ పథకాలను మాత్రం కొనసాగిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును విస్తరించాలని చెప్పారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు.
