పెండింగ్​లో ధరణి పోర్టల్​కు వస్తున్న అర్జీలు

పెండింగ్​లో ధరణి పోర్టల్​కు వస్తున్న అర్జీలు
  • నెలలు గడుస్తున్నా పరిష్కారం కాని భూసమస్యలు
  • కలెక్టరేట్​లో వందకు పైగా అర్జీలు పెండింగ్​

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ధరణి పోర్టల్​కు వస్తున్న అర్జీలు పెండింగ్​లో పడుతున్నాయి. నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఇటు మండల రెవెన్యూ ఆఫీసులు, అటు కలెక్టరేట్​ చుట్టూ తిరుగుతున్నారు. అయినా సరైన టైంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. 

వెలుగులోకి వచ్చిన సమస్యలెన్నో

ధరణి పోర్టల్​ అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో భూసమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం ధరణి పోర్టల్​లో 33 రకాల మాడ్యూల్స్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రజలు వివిధ సమస్యలపై మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకొని వాటి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ గత రెండు నెలల నుంచి ఫైల్స్​ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. పై అధికారుల ను ఆరా తీస్తే చేస్తే కలెక్టరేట్​లోనే వందకు పైగా పెండింగ్​ ఉన్నట్టు సమాధానాలు వస్తున్నాయని చెపుతున్నారు. 

కలెక్టర్​ ట్రాన్స్​ఫర్​ కావడంతో అర్జీలు పెండింగ్.. 

ధరణి దరఖాస్తులు దాదాపు రెండు నెలలుగా పెండింగ్​లో ఉన్నట్టు సమాచారం. నెల కిందట కలెక్టర్​ భారతి హోళికేరి ట్రాన్స్​ఫర్​ కావడం, కొత్త కలెక్టర్​గా బదావత్​ సంతోష్​ వచ్చారు. కలెక్టర్ల బదిలీల వల్లనే ధరణి దరఖాస్తుల పరిశీలన కాస్త మందగించినట్టు తెలుస్తోంది. హోళికేరి ట్రాన్స్​ఫర్​ కావడానికి 15 రోజుల ముందు నుంచి వీటిని పెండింగ్​లో పెట్టారు. కొత్త కలెక్టర్​ సంతోష్​  బాధ్యతలు చేపట్టి నెలరోజులు దాటింది. నిత్యం వివిధ కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. 

పెరుగుతున్న అర్జీలు

మీసేవా కేంద్రాలతో పాటు, ఇటు ప్రజావాణిలోనూ ధరణి సమస్యలపై అర్జీలు పెరుగుతన్నాయి. సర్వేనంబర్ల తారుమారు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పట్టా భూములు ప్రైవేట్​, అసైన్డ్​ భూములుగా నమోదు కావడం, విరాసత్​, మ్యుటేషన్​ తదితర సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్​ లాగిన్​కు వెళ్తాయి. అక్కడినుంచి అడిగిన రిపోర్టులను తహసీల్దార్​​, ఆర్డీవో ఆఫీసుల నుంచి కలెక్టరేట్​కు పంపుతారు. నెల రోజులుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు మండల రెవెన్యూ ఆఫీసుల్లో సంప్రదిస్తున్నారు. అయితే వారి దరఖాస్తులు కలెక్టర్​ లాగిన్​లో పెండింగ్​ ఉన్నాయని ఆఫీసర్ల నుంచి సమాధానం వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్​ ఫైల్స్​ను త్వరగా టేకప్​​ చేయాలని అర్జీదారులు కోరుతున్నారు.