పింఛన్ సొమ్ము రూ. 5 లక్షలు మాయం.. జనగామ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన

పింఛన్ సొమ్ము రూ. 5 లక్షలు మాయం.. జనగామ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
  • ఇద్దరు పోస్టల్  సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం 
  • పోలీసు స్టేషన్ కు చేరిన పంచాయితీ
  • జనగామ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన

బచ్చన్నపేట,వెలుగు: జనగామ జిల్లాలో  రూ. 5 లక్షల చేయూత పింఛన్ డబ్బులు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పోస్టల్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం బుధవారం (సెప్టెంబర్ 03) బచ్చన్నపేట ​స్టేషన్​కు చేరడంతో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. పోచన్నపేట పోస్టుమాస్టర్  పాకాల నాగయ్య  .. గత సోమవారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. 

చిన్నరామచర్ల పోస్టాఫీస్​సిబ్బంది రాకేశ్ రోజువారి బట్వాడా పోచన్నపేటలో అందిస్తుంటాడు. పోస్టుమాస్టర్ నాగయ్య  పంపిణీ చేయాల్సిన పింఛన్ డబ్బు రూ. 5లక్షలు రాకేశ్​ద్వారా పంపాలని బచ్చన్నపేట సబ్​పోస్టు మాస్టర్​కు మెసేజ్​చేశాడు. దీంతో డబ్బులు పంపించగా మధ్యలోనే మాయమైంది. డబ్బులు పోస్టు మాస్టర్​నాగయ్యకు ఇచ్చానని, ముట్టినట్లు రసీదు ఇచ్చాడని రాకేశ్​ చెబుతున్నాడు. తనకు రూ. 5 లక్షలు ఇవ్వకముందుకే రసీదుపై సంతకం చేయించుకున్నాడని నాగయ్య అంటున్నాడు. 

ఇది జరిగి మూడు రోజులవుతున్నా బయటకు రాలేదు. బుధవారం వారు పోలీసులను ఆశ్రయించడంతో  విషయం బయటపడింది. డబ్బులు ఇవ్వకుండానే సంతకం తీసుకొని రాకేశ్​మోసం చేశాడని పోస్ట్ మాస్టర్ నాగయ్య ఆరోపించారు. ఇద్దరు  మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని  పోలీసులు సూచించారు. రూ. 5 లక్షల పింఛన్ డబ్బులు ఎటూ పోయాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.