టెహ్రాన్ ఖాళీ! ప్రాణ భయంతో జనం పలాయనం.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆరో రోజూ భీకర దాడులు

టెహ్రాన్ ఖాళీ! ప్రాణ భయంతో జనం పలాయనం.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆరో రోజూ భీకర దాడులు
  • షాపులన్నీ క్లోజ్.. రోడ్లన్నీ నిర్మానుష్యం
  • దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ 
  • ఇప్పటివరకూ ఇరాన్​లో 585 మంది మృతి.. 1,326 మందికి గాయాలు 
  • ఇజ్రాయెల్ లో 24 మంది మృతి.. 1,300 మందికి గాయాలు 

టెహ్రాన్/జెరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య బుధవారం కూడా భీకర దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను విడిచి జనం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో టెహ్రాన్ సిటీ దాదాపుగా ఖాళీ అయి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సిటీలోని ప్రఖ్యాత గ్రాండ్ బజార్ సహా అన్ని షాపింగ్ మాల్స్, వ్యాపారాలు మూతపడ్డాయి. 

మరోవైపు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. ఆరు రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ లో 585 మంది చనిపోగా, 1,326 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ లో 24 మంది మృతిచెందగా, 1,300 మంది గాయపడ్డారు. టెల్ అవీవ్ సిటీపైకి ఫతా–1 హైపర్ సోనిక్ మిసైల్​తో ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో బుధవారం ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. 

అమెరికా బెదిరింపులకు లొంగేది లేదంటూ బుధవారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఖమేనీ తలదాచుకుంటున్నట్టు భావిస్తున్న టెహ్రాన్​కు సమీపంలోని లావిజన్ ప్రాంతంపై ఫైటర్ జెట్​లతో బాంబుల వర్షం కురిపించింది. మొత్తం 50 ఫైటర్ జెట్ లతో ఇరాన్​లోని యురేనియం సెంట్రిఫ్యూజ్, మిసైల్ తయారీ కేంద్రాలను పేల్చేసింది. మషాద్ ఎయిర్ బేస్​లో తబ్రీజ్ మిసైల్స్ స్థావరాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఇరాన్ ప్రయోగించిన 10 మిసైళ్లను అడ్డుకున్నట్టు తెలిపింది. 

ఇరాన్ లోని కేర్మన్ షా ఏరియాలోని స్థావరంలో ఉన్న ఐదు ఏహెచ్-1 అటాక్ హెలికాప్టర్లను పేల్చేశామని ప్రకటించింది. మరోవైపు తాము టెల్ అవీవ్ పైకి ఫతా–1 మిసైల్ ను ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ కు 30 ఏరియల్ రీఫ్యూయెలింగ్ ట్యాంకర్లను పంపినట్టు అమెరికా వెల్లడించింది. ఆరు రోజుల్లో ఇరాన్ 400కుపైగా మిసైల్స్, వందలాది డ్రోన్లను ప్రయోగించగా.. ఇజ్రాయెల్​లోని 40 సైట్లు ధ్వంసమయ్యాయి. కాగా, ఇరాన్ నుంచి 110 మంది ఇండియన్ స్టూడెంట్లతో బయలుదేరిన విమానం అర్మేనియా నుంచి దోహాకు చేరుకుంది.

వాట్సాప్ డిలీట్ చేయండి: ఇరాన్ హెచ్చరిక 

ఇరాన్ ప్రజలంతా తమ ఫోన్లలో వాట్సాప్​ను డిలీట్ చేయాలని ఆ దేశం హెచ్చరించింది. వాట్సాప్ ద్వారా ఇరాన్ సమాచారం ఇజ్రాయెల్​కు చేరుతోందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఆ మెసెంజర్ యాప్ మాతృ సంస్థ మెటా ఖండించింది. 

ఇజ్రాయెల్ కు ఒక్క రాత్రికి రూ. 2,400 కోట్ల ఖర్చు 

ఆపరేషన్ రైజింగ్ లయన్ లో భాగంగా ఇరాన్ పై యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్ కు రోజురోజుకూ ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నది. ఇరాన్ నుంచి సైతం మిసైల్, డ్రోన్ దాడులు పెరిగాయి. దీంతో ఇరాన్ పై దాడులు చేయడంతోపాటు ప్రతిదాడులను అడ్డుకునేందుకు గాను ఒక్క రాత్రికే ఏకంగా రూ.2,400 కోట్లు (285 మిలియన్ డాలర్లు) మేరకు ఇజ్రాయెల్ కు ఖర్చు అవుతోందని అంచనా వేస్తున్నారు. 

యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అమెరికా నుంచి ఆయుధాల సరఫరా, సాయం ఆగిపోతే గనక.. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ మరో 10 నుంచి 12 రోజుల్లోనే పతనమయ్యే పరిస్థితికి చేరుతుందని అంటున్నారు.