హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి సమయంలో జనం వాహనాలను మస్తు ఎక్కువ కొన్నారు. కరోనా భయం కావొచ్చు.. ఆర్టీసీ బస్సులు, రైళ్లు సరిగా నడవకపోవడం కావొచ్చు.. కారణమేదైనా ఎక్కువ మంది సొంత బండ్లలోనే ప్రయాణం కట్టారు. ఈ క్రమంలోనే ఎక్కువగా వాహనాలను కొనుగోలు చేశారు. ఫస్ట్వేవ్లో కాస్త డల్గానే ఉన్నా.. సెకండ్వేవ్లో మాత్రం వాహన కొనుగోళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. నిరుటి నుంచి ఇప్పటిదాకా 9 లక్షలకుపైగా కొత్త బండ్లను కొనుగోలు చేశారు. వీటిలో బైకులు 7.4 లక్షలు, కార్లు 1.3 లక్షలు, ఇతర వాహనాలు 30 వేల దాకా ఉన్నాయి. లగ్జరీ కార్ల కొనుగోళ్లూ ఎక్కువగా జరిగాయి. ఈ అమ్మకాలతో ఆర్టీఏకి కూడా ఆమ్దానీ బాగానే వచ్చింది. ఆర్టీఏ లెక్కల ప్రకారం నెలకు సగటున 70 వేల బండ్లకు రిజిస్ట్రేషన్ చేశారు.
సెకండ్ హ్యాండ్ బండ్లు కూడా..
కొత్త బండ్లు కొనే స్థోమత లేనోళ్లు పాత బండ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో సెకండ్ వెహికల్ సేల్స్ కూడా బాగా పెరిగాయి. ధరలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది వాటిని కొన్నారు. అందులోనూ చాలా మంది ఆన్లైన్లోనే వెహికల్స్ కొన్నారు. డీలర్లు, ఏజెంట్లు, తెలిసినోళ్ల దగ్గర కూడా కొందరు కొనుకున్నారు. నెలకు సగటున 60 వేల సెకండ్ హ్యాండ్ బండ్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. హైదరాబాద్తో పాటు, వరంగల్, కరీంనగర్లాంటి సిటీల్లో సెకండ్ హ్యాండ్ వాహనాల ఏజెన్సీలు బాగా పెరిగాయి. కొందరు ఫైనాన్షియర్లు కూడా కిస్తీ కట్టని బండ్లను లాక్కొచ్చి తక్కువ ధరకు అమ్ముతున్నారు.
ఏటేటా బండ్లు పెరుగుతున్నయ్
రాష్ట్రంలో ఏటా బండ్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మే 31 వరకు 1.37 కోట్లకుపైగా వాహనాలున్నాయి. అందులో ఎక్కువగా బైకులే కోటీ 2 లక్షలున్నాయి. 18.3 లక్షల కార్లుండగా, మిగతావి గూడ్స్ క్యారేజీలు, ఆటోలు, ఎడ్యుకేషనల్ బస్సులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. దీంతో ఆర్టీఏకి పన్నుల రూపంలో ఆదాయం బాగా వస్తోంది. ఒక్క 2020–21లోనే రూ.3,228 కోట్ల ఆదాయం వచ్చింది.
రోజూ 40 కార్లు అమ్ముడైనయ్
లాక్డౌన్తో రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది. దానికి తోడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కరోనా సోకే ముప్పుందని చాలా మంది బండ్లు కొంటున్నరు. ఒక్కో షోరూంలలో రోజూ 25 నుంచి 40 వరకు కార్లు అమ్ముడైనయి. ఇప్పుడు రోజూ 5 నుంచి 10లోపు అమ్ముడుపోతున్నయి. ఎక్కువ మంది రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖరీదుంటున్న చిన్న కార్లనే కొంటున్నరు.
- చైతన్య , ట్రూవాల్యూ కార్స్ ఎగ్జిక్యూటివ్, హబ్సిగూడ వరుణ్ మోటార్స్
బస్సుల్లో ఇబ్బందని బైక్ కొన్న
నేను రోడ్ సైడ్ వ్యాపారం చేస్తున్న. లాక్డౌన్ టైంలో బస్సులు, రైళ్లు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడిన. పిల్లలతో ఊరికి పోవాలంటే దోస్తు బండిని అడగాల్సొస్తుండే. ఎక్కడకు పోవాలన్న మస్తు ఇబ్బంది అయింది. బస్సుల్ల పోవాలన్న కరోనా భయం ఉంది. అందుకే ఫైనాన్స్లో బైకును కొనుకున్న.
- సునీల్ కుమార్, సికింద్రాబాద్