కార్గో సేవల్లో వేగం పెంచని ఆర్టీసీ

కార్గో సేవల్లో వేగం పెంచని ఆర్టీసీ
  • ప్రైవేట్​ ఏజెన్సీలు స్లో
  • ఎంజీబీఎస్​, జేబీఎస్​ల్లోనే ఫాస్ట్ సర్వీసు ఫెసిలిటీ
  • 24 గంటల్లో పార్సిల్ ​డెలివరీ.. దాంతో కౌంటర్ల వద్ద క్యూ
  • ప్రైవేట్ ఏజెన్సీలో ఇస్తే రెండు రోజులైనా నో డెలివరీ

హైదరాబాద్​, వెలుగు: సిటీలో కార్గో, కొరియర్ ప్రైవేటు ఏజెన్సీసేవల స్పీడ్​పై ఆర్టీసీ ఫోకస్​ చేయడం లేదు. గతేడాది మొదట్లో ట్విన్​ సిటీస్​లో 20  కౌంటర్లతో సేవలు ప్రారంభించగా ప్రస్తుతం 190కి చేరాయి. కౌంటర్లు పెరిగినా సేవలు మాత్రం స్లోగానే ఉంటున్నాయి. ఇందులో 40 మాత్రమే ఆర్టీసీకి చెందినవి ఉండగా, మిగతావి ప్రైవేట్​ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. పార్సిల్​పై వీటికి 15 శాతం కమిషన్​ని ఆర్టీసీ అందిస్తోంది. అయినా ప్రైవేట్ ఏజెన్సీల సర్వీసుల్లో  స్పీడ్ ఉండటం లేదు. పార్సిల్​ ఇస్తే రెండు, మూడు రోజుల తర్వాత డెలివరీ అవుతున్నాయి.  అదే ఎంజీబీఎస్, జేబీఎస్ ​బుకింగ్ కౌంటర్లలో పార్సిల్ ​అందజేస్తే 24 గంటల్లోపే డెలివరీ అవుతుండడంతో కస్టమర్లు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికే వెళ్తున్నారు. దీంతో అక్కడి కౌంటర్ల వద్ద క్యూ పెరుగుతోంది.  సాయంత్రం సమయంలో ఒక్క పార్సిల్​ ఇవ్వాలంటే గంట పాటు వెయిట్​చేయాల్సి వస్తోందని జనం చెప్తున్నారు. ఇక్కడ కౌంటర్లు పెంచాలని కూడా కోరుతున్నారు. 

సాయంత్రమైందంటే  క్లోజ్​
ఎంజీబీఎస్​, జేబీఎస్ ​మినహా ఇతర ప్రాంతాల్లోని ఆర్టీసీ కౌంటర్లు, ప్రైవేట్ ఏజెన్సీల వద్ద పార్సిల్ ​ఇస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియడంలేదు. ఒక్కోసారి ఒకటి, రెండు రోజులు లేట్ అవుతోందని కస్టమర్లు అంటున్నారు. ఎంజీబీఎస్​, జేబీఎస్​లలో 24 గంటల పాటు అందుబాటులో ఉంటుండగా మిగతా చోట్ల సాయంత్రం కాగానే క్లోజ్ ​చేస్తున్నారంటున్నారు. ఎమర్జెన్సీ అయితే ఎంజీబీఎస్​, జేబీఎస్​లకు వచ్చి పార్సిల్స్ ​ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. 24 గంటలు ఫెసిలిటీ కల్పించాలని కోరుతున్నారు.  

ప్రైవేట్​ ఏజెన్సీల్లో ఎక్కువ వసూల్
ట్విన్​ సిటీస్​లోని ప్రైవేట్ ఏజెన్సీలు పార్సిల్​బుకింగ్​కు  ఎక్కువగా డబ్బులు వసూల్​ చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ ​కౌంటర్లకు రావడానికి ఇది కూడా ఒక కారణమని కస్టమర్లు చెబుతున్నారు. అన్నిచోట్ల ఒకే రేట్లు, స్పీడ్​గా సర్వీస్​ ఉంటే ఆర్టీసీసేవలకు మరింత గుర్తింపు వస్తుందని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని  కోరుతున్నారు. 


బయట రేట్లు ఎక్కువ 
2 పేజీల డాక్యుమెంట్​ని జహీరాబాద్​​కి  కొరియర్ చేయాలని అడిగితే  రూ. 60 అవుతాయని, డెలీవరీకి రెండు రోజులు టైమ్ పడుతుందని చెప్పారు. ఎంజీబీఎస్​కి వచ్చి రూ. 30కి  కొరియర్​ చేశా. కేవలం 24 గంటల్లో డెలీవరీ అయ్యింది. ఇక్కడ త్వరగా అవుతోందని కొత్తపేట​నుంచి ఎంజీబీఎస్​కి వచ్చా. ఎప్పుడూ ఇలాగే చేస్తున్నా. - రాహుల్, కొత్తపేట

త్వరగా అందకపోతుండగా..
నేను సేఫ్టీ మెటీరియల్ డీలర్​ని. కార్గోలో డైలీ​ పార్సిల్స్ ​వేస్తా. మెటీరియల్ ​త్వరగా అందకపోవడంతో  ఎప్పుడొస్తుందని కస్టమర్ల నుంచి కాల్స్ ​వస్తున్నాయి.  దీంతో షేక్ పేట నుంచి ఎంజీబీఎస్​, జేబీఎస్​లకు వెళ్లి పార్సిల్స్ వేస్తున్నాం. త్వరగా వెళ్తుందని ఇంత దూరం రావాల్సి వస్తోంది. - నరేశ్ సాగర్, షేక్ పేట