ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయ.. నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు.. అని తెలుగులో చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా! కానీ, ఇప్పుడు ఆ ఉల్లిని తెచ్చి కూరొండే పరిస్థితే లేదు. అంతలా మండిపోతున్నాయి దాని రేట్లు. అందుకే ఉత్తర్ప్రదేశ్లో ఉల్లిని ఉద్దెరకిస్తున్నారు. ఆధార్కార్డో లేదంటే వెండి నగలనో తాకట్టు పెట్టుకుని ఉల్లిగడ్డలను జనానికిస్తున్నారు. అయితే, ఇదో రకమైన నిరసన లెండి. పెరిగిన ఉల్లి రేట్లకు నిరసనగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో కొందరు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు తమ తమ షాపుల్లో ఈ కొత్త ‘ఉల్లి ఉద్దెర’ నిరసనలకు బాటలు వేశారు. కొన్ని షాపుల్లో ఉల్లిగడ్డలను లాకర్లలో పెడుతున్నారని షాపు ఓనర్లు చెబుతున్నారు. ఇక, పోయిన శుక్రవారం యూపీ అసెంబ్లీ బయట కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కిలో ఉల్లిని 40 రూపాయలకు అమ్మి తమ నిరసనను తెలిపారు.
ఆనియన్ దోశె లేదు.. వంటలు రుచి లేవు
హోటళ్లలో ఆనియన్ దోశెకు డిమాండ్ ఎట్లుంటదో తెలిసిందే కదా. కానీ, ఈ కాలంలో ఆనియన్ దోశె తినేటట్టే లేదు. హోటళ్లు వేసేటట్టే లేదు. అవును, బెంగళూరులోని హోటళ్లు ఉల్లి దోశెను బంద్పెట్టాయి మరి. ‘‘హోటళ్లలో ఉల్లిగడ్డ వాడకాన్ని బాగా తగ్గించేశాం. మంచి రెస్టారెంట్లు రేట్లు పెంచి దానికి తగ్గట్టు కాస్ట్ను కవర్ చేసుకోగలవు. కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు చిన్న చిన్న హోటళ్లకే ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వాళ్లకు రేట్లు పెంచితే భారం పడుతుంది. కొన్ని వంటలను ఉల్లి లేకుండా చేయలేం. అయితే, చాలా వరకు మేం ఉల్లిని తగ్గించాం” అని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ట్రెజరర్ వి. కామత్ అన్నారు. ఇక, ఉల్లిని తగ్గించడం వల్ల హోటళ్లలో తమకు ఇష్టమైన వంటకాల టేస్ట్ తగ్గిపోయిందని కస్టమర్లు అంటున్నారు. కొన్ని ఈటరీలు, క్యాంటీన్లు పూర్తిగా ఉల్లి లేకుండానే వంటలను చేసేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.
ఉల్లికి పూజలు
ఉల్లి దేవుడైపోయినట్టుంది. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన కొందరు వ్యక్తులు ఉల్లిగడ్డకు పూజలు చేశారు. దండేసి హారతులిచ్చారు. ఈ మధ్య కాలంలో పేదోళ్లు, మధ్య తరగతోళ్లు ఉల్లిని కొనే పరిస్థితే లేదని ఆవేదన చెందారు. ఉల్లిని చూసి పూజ చేసే పరిస్థితులే ఉన్నాయంటున్నారు. నిన్నగాక మొన్న కొందరు వ్యక్తులు ఉల్లితో దండలు చేసి మెడలో వేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, హెల్మెట్ పెట్టుకుని మరీ ఉల్లిని అమ్మారు మరికొందరు.